దాదాపు ఎనిమిది నెలల పాటు హైదరాబాదు నగరానికి పరిమితమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ పోరాడే పార్టీ అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేస్తూ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న నాయకులతో కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎన్నికలలో ఓడిపోయినా గాని జనసేన పార్టీకి ప్రజలలో ఆదరణ ఉందని స్పష్టం చేశారు.
క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉంటే కచ్చితంగా జనసేన రాజకీయాల్లో రాణించడం గ్యారెంటీ అని పవన్ ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారితో పేర్కొన్నారు. పరిస్థితి ఇలా ఉండగా చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్ తో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లోప్రతిసారి వేసే డైలాగ్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ క్యాడర్ తో వెయ్యటం గమనార్హం. విషయం ఏమిటంటే చంద్రబాబు 2024 కంటే ముందే జమిలి ఎన్నికలు వస్తాయని జోస్యం చెబుతూ పార్టీ కేడర్ అంతా సిద్ధంగా ఉండాలంటూ, ప్రస్తుతం ఉన్న కష్టాలు మరెన్నో రోజులు ఉండవు అంటూ ధైర్యం చెబుతూ ఉన్నారు.
ఇదే డైలాగులు తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేడర్ తో చెప్పుకొచ్చారు. తనకి పై నుండి అందుతున్న సమాచారం ప్రకారం దేశమంతటా ఒకేసారి జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి 2024 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. అదేవిధంగా అమరావతి రాజధాని గురించి కూడా స్పందించిన పవన్ కళ్యాణ్, రాజధాని రైతులకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని తాజా పర్యటనలో చెప్పుకొచ్చారు. పోలవరం విషయంలో అన్ని వివరాలు తెలుసుకుని కేంద్రానికి ఓ నివేదిక అందజేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.