సొంత పార్టీ జనసేనకు జవసత్వాలు నింపే పనిలో పవన్ కల్యాణ్ పడ్డారు.బిజెపి తనను సైడ్ లైన్ చేస్తోందని పవన్ కల్యాణ్ పసిగట్టేశారు.ఇప్పటికైనా తాను మేలుకోకుంటే వచ్చే ఎన్నికల నాటికి తాను మరింత నష్టపోతానని ఆయనకు జ్ఞానోదయం అయిందంటున్నారు.తాజా పరిణామాలను పరిశీలిస్తే రాష్ట్రంలో అధికారం లో ఉన్న వైసీపీని బీజేపీ బాగా పోత్సహిస్తోంది.
ఈ రోజో రేపో వైసీపీ ఎన్డీయేలో చేరడం, వైసిపికి నరేంద్ర మోడీ కేబినెట్లో స్థానం కల్పించటం జరిగిపోయే సూచనలు గోచరిస్తున్నాయి. మరోవైపు పవన్ కల్యాణ్ కి బిజెపిలో ఢిల్లీ స్థాయిలో ప్రాధాన్యం కూడా తగ్గిపోయిందట.ఇక పవన్ కల్యాణ్ తో ఒకనాడు వేదిక పంచుకున్న నరేంద్ర మోడీ ఇపుడు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రావడంలేదు. మరో వైపు జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయండని ఎన్నో అభ్యర్ధనలు చేసినబీజేపీ యోధ అమిత్ షా ఇపుడు పవన్ కల్యాణ్ ఊసే తలవడంలేదు.అంతేగాక పవన్ కల్యాణ్ అంటే బిజెపికి చిన్న చూపు కూడా ఉంది.
పవన్ కల్యాణ్ కి సినీ గ్లామర్ ఉంది తప్ప రాజకీయ గ్రామర్ లేదని బిజెపి భావిస్తోంది. పవర్ స్టార్ సినీ గ్లామర్ ను వాడుకొని ఆయనకు రేపటి ఎన్నికల సమయంలో పదో పరకో సీట్లు ఇచ్చి సరి పెట్టేసే పన్నాగం కూడా బీజేపీ నడుపుతోంది.ఇప్పుడిప్పుడే ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి అవగతమవుతున్నాయంటున్నారు.ఇంకా ఆలస్యం చేస్తే తన పార్టీ మరింత వెనక్కు పోగల దని అంచనాకొచ్చిన పవన్ కల్యాణ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారని జనసేన వర్గాలు చెప్పాయి.ఇపుడు పవన్ కల్యాణ్ తన పార్టీ మీద శ్రద్ధ పెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో బలమైన నియోజకవర్గాలను గుర్తించి అక్కడ సమర్ధులైన వారిని ఇంచార్జిలుగా నియమించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారట .
బలమైన టీంతో ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోవడానికి పవన్ కల్యాణ్ పెద్ద ప్రణాళికే సిద్ధం చేసుకున్నారని ,ఇది నిజంగా శుభపరిణామేనని జనసేన వర్గాలు సంబరపడుతున్నాయి. పన్నెండేళ్లుగా పవన్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ,2014 లోనే జనసేన ఆవిర్భవించినప్పటికీ ఈ ఆరేళ్లలో ఆ పార్టీకి పవన్ కల్యాణ్ ఒక రూపాన్ని ఇవ్వలేకపోయారు.ఇంకా చెప్పాలంటే సంస్థాగత నిర్మాణమే లేదు.ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ లోని రాజకీయ నాయకుడు నిద్ర లేచాడని, ఇక జనసేన పార్టీ జనాల్లోకి దూసుకెళుతుందని జన సైనికులు జోష్ తో ఉన్నారు.ఏదేమైనా పవన్ కల్యాణ్ ఇకనైనా నిలకడ రాజకీయాలు చేస్తే నిలదొక్కుకుంటారనడంలో సందేహం లేదు.