విశాఖపట్నం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఎస్పి అధినేత్రి మాయావతి రాష్ట్రానికి చేరుకున్నారు. మంగళవారం విశాఖపట్నం చేరుకున్న మాయావతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానం పలికారు.
విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాయావతి కాన్వాయ్ బయటికి వస్తున్న సమయంలో ఆమెను కలిసిన పవన్ కల్యాణ్.. రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. అనంతరం పవన్ వంగి ఆమె పాదాలకు వందనం చేశారు. ఆ తర్వాత బస చేసేందుకు మాయావతి హోటల్కు వెళ్లిపోయారు.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు, బిఎస్పి ఉమ్మడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్తో కలిసి మాయావతి పలు ఎన్నికల సభల్లో అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొననున్నారు.
రెండు రోజుల పాటు మాయావతి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ఏప్రిల్ మూడవ తేదీ ఉదయం వైజాగ్లో పవన్ కళ్యాణ్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం విజయవాడ అజిత్సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగసభలో మాయావతి పాల్గొంటారు.
ఆ మరుసటి రోజు మాయావతి తిరుపతిలో జరిగే బహిరంగసభలో పాల్గొన్న తర్వాత సాయంత్రం హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించే బహిరంసభలో పవన్ కల్యాణ్తో కలిసి పాల్లొని ప్రసంగిస్తారు.