Pawan Kalyan: పవన్ కల్యాణ్ Pawan Kalyan తిరుపతి ఉప ఎన్నిక విషయంలో పవన్ వ్యూహాత్మక అడుగు వేసిందా? లేక బీజేపీ ఒత్తిడికి తలొగ్గిందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తిరుపతి ఉప ఎన్నికలో జనసేన అభ్యర్ధినే నిలబెడదామని స్థానిక నేతలు, జనసైనికులు, అభిమానులు పవన్ తో మొరపెట్టుకున్నారు. బీజేపీ తమను చిన్న చూపు చూస్తోందని కూడా చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి వస్తున్న సపోర్ట్ లోకల్ బీజేపీ ఇవ్వట్లేదని జనసేనాని కూడా అన్నారు. తిరుపతిలో పోటీ చేసేందుకే జీహెచ్ఎంసీలో తప్పుకుందనే వార్తలూ వచ్చాయి. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీకి మద్దతిచ్చి తప్పుకుంది. ఇందుకు విశాఖ ఉక్కు విషయం ఒక కారణమని చెప్పాలి.
విశాఖ ఉక్కు విషయంలో బీజేపీ వైఖరికి ఓట్లు పడతాయో లేదో.. ఆ వ్యతిరేకత ఏమైనా తమ మీద పడుతుందనే.. బీజేపీకి మద్దతిచ్చి జనసేన తప్పుకుందా? అనే ప్రశ్నలు లేకపోలేదు. రాష్ట్రాభివృద్ధి కోసమని, 1999లో ఇక్కడ బీజేపీ గెలిచిందని.. ఇప్పుడు మద్దతిస్తున్నామని చెప్పుకొచ్చింది. పనిలోపనిగా అధికార వైసీపీ ఆగడాలను అరికట్టేందుకే అని ఓ కౌంటర్ కూడా వేసేసింది. అయితే.. జనసేనాని మనసులో నిజంగా ఇదే ఉందా? విశాఖ ఉక్కును దృష్టిలో పెట్టుకుని పవన్ రాజకీయ పరిణితి చూపించి బీజేపీని ప్రజల ముందు నిలబెడితే జనసైనికులకు ఓకే. అలాకాకుండా మిత్ర ధర్మం చూపిస్తే మాత్రం జనసైనికుల్లో అసహనం ఖాయం. ఎంత పవన్ పై అభిమానమున్నా ప్రతిసారీ పొత్తులతోనే ముందుకెళ్తే జనసేన ఎదిగేదెప్పుడు? అనేది ప్రశ్న.
జీహెచ్ఎంసీ విషయంలో.. ‘ఈ ఒక్కాసారి నా మాట వినండి’, తిరుపతి విషయంలో.. ‘అభివృద్ధి కోసమే’.. అంటూ ప్రతిసారీ పవన్ ఏదొక ప్రకటన చేస్తే పార్టీ మీద జనసైనికులకే కాదు ప్రజలకు నమ్మకం కలిగేదెప్పుడు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటిందంటే.. పవన్ కంటే ఎక్కువ కష్టపడింది జనసైనికులే. దుబ్బాక, జీహెచ్ఎంసీ మ్యాజిక్ తిరుపతిలో రావాలంటే ఇక్కడి పరిస్థితులు, తెలంగాణ పరిస్థితులు వేరు. 1999లో ఇక్కడ బీజేపీ గెలిచిందని అంటున్న జనసేన.. తర్వాత 4సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారీ గెలవలేదు బీజేపీ. పవన్ కు ఈ లాజిక్ మిస్సయ్యారని అనుకోలేం. ఏదైమైనా.. విశాఖ ఉక్కు దెబ్బకి పవన్ తిరుపతిలో వెనకడుగు వేశారో.. నిజంగా మద్దతిచ్చారో అనేది చర్చనీయాంశం..! మరి పవన్ కు తిరుపతిలో ఎటువంటి ఫలితం వస్తుందో చూడాలి..!!