PCC Revanth Reddy; రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు.. ప్రకటన వచ్చినప్పటి నుండీ నేటి ప్రమాణ స్వీకారం వరకు భారీ బిల్డప్పులు మధ్య.., క్రేజ్ మధ్య ఆయన తీరు సాగింది. మామూలుగానే రేవంత్ అంటే మీడియా ఫోకస్ ఎక్కువ, ఇక పీసీసీ అధ్యక్షుడంటే మీడియాలో మరింత ఫోకస్ పెరుగుతుంది. ఈ నాలుగు రోజుల నుండీ అదే జరుగుతుంది. అయితే ఇంత బిల్డప్ ఇచ్చినా.. ఏం చేసినా రేవంత్ ముందులా ఉంటె కుదరదు. మాటల్తో నెట్టుకొస్తాం.., ప్రాసలతో పని కానిచ్చేస్తాం అంటే కుదరదు. తెలంగాణ గడ్డపై ఆల్రెడీ కేసీఆర్ రూపంలో మాటాలమారి ఉన్నారు, మరో మాటాలమారికి అక్కడ స్కోప్ లేదు. మాటలతో పాటూ పనీ చేస్తేనే రేవంత్ కి, పదవికి ధన్యత.. లేకపోతే ఉన్న పేరు కూడా పోతుందేమో..! రేవంత్ లో చాల మార్పులు రావాలి.
PCC Revanth Reddy; ఆరోపణలతో వదిలేస్తే ఎలా..!?
గడిచిన రెండేళ్లలో కావచ్చు.. అంతకు ముందు కావచ్చు.. రేవంత్ రెడ్డి టీఆరెస్ ప్రభుత్వంపైన.., కేసీఆర్ కుటుంబం పైనా చాలా ఆరోపణలు చేసారు. కేటీఆర్ ఇంటి ఆక్రమణ, కేసీఆర్ అవినీతి, స్థలాల ఆక్రమణలు ఇలా చాలానే ఉన్నాయి. మీడియా ముందుకు వచ్చి.. ఆరోపణలు చేసి.., ఒక వారం రోజుల పాటూ హడావిడి చేసేవారు. అయితే వారం తర్వాత ఆ ఇష్యూ మాయమయ్యేది. ఆ ఆరోపణ పక్కకు వెళ్లి కొత్తది పుట్టుకొచ్చేది. ఇలా ఆరోపణలు చేయడం తప్ప.. దానిపై గట్టిగా నిలబడడం, అధరాలు చూపించడం.., కోర్టుల్లో పిటిషన్లు వేయడం.., తుదికంటా పోరాడడం వంటివి చేయలేదు. అందుకే రేవంత్ ఇప్పటి వరకు మాటల మారిగానే మిగిలిపోయారు. ఆయన మాటల్లో పస, ప్రాస ఉండడం.. నెట్వర్కింగ్ గట్టిగ చేస్తుండడం వలన రేవంత్ కి మీడియాలో క్రేజీ ఏర్పడింది. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడయ్యాక కూడా ఆరోపణలతో వదిలేస్తాం అంటే సమాజం అంగీకరించకపోవచ్చు. ఇన్నాళ్లు బోలెడన్ని ఒత్తిళ్లు ఉండవచ్చు, బాధ్యత లేకపోవచ్చు, అడిగేవారు లేకపోవచ్చు.., తగ్గమని సూచనలు వచ్చి ఉండొచ్చు.. కానీ ఇకపై తెలంగాణాలో కాంగ్రెస్ కి రేవంతే బాస్.. ఆయనే ప్రతిపక్షం.., ఆయనే అన్ని… సో మాటలతో పాటూ మ్యాటర్ లోకి కూడా దిగాల్సి ఉంది.
టీడీపీ ముద్ర ఉన్న… కాంగ్రెస్ ముద్ర గట్టిగా పడాలి..!!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ అన్న ప్రకటన వచ్చినప్పటి నుండి తెలంగాణాలో కాంగ్రెస్ కంటే.., తెలంగాణాలో టీడీపీ, ఏపీలో టీడీపీ విపరీతమైన సంతోషంలో మునిగిపోయాయి.. అంటే ఇప్పటికే రేవంత్ అంటే టీడీపీగానే చాలా ముద్ర ఉంది. కానీ టీడీపీకి, కాంగ్రెస్ కి తరతరాల శత్రుత్వం ఉంది. ఈ రెండు పార్టీలు గత ఎన్నికల్లో ప్రజల ముందుకి వెళ్లి బొక్కబోర్లా పడ్డాయి. ఈ రెండు పార్టీల కలయికని తెలంగాణ ఓటర్లు అంగీకరించలేదు. ఈ విషయాన్నీ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. తనతో పాటె టీడీపీలో ఎదిగిన సీతక్క, ఇతర నేతలను చంకన ఎక్కించుకుని… అందలమెక్కిస్తే కాంగ్రెస్ పురాతన నేతలకు మండడం ఖాయం. వాళ్ళే.. టీడీపీ రేవంత్ అంటూ
బయటకు చెప్పుకుంటూ వెళ్తారు. అవసరమైతే టీడీపీలో పనికొచ్చే లీడర్లని.., ప్రజాబలం ఉన్న నేతలను ఎంచుకుని కాంగ్రెస్ లో చేర్చుకోవడం వరకు జరిగే వీలుంది. అలా కాకుండా టీడీపీపై ఇప్పటికీ అభిమానం చాటుకునేలా చేస్తే మాత్రం చావు దెబ్బ తప్పకపోవచ్చు. తెలంగాణాలో టీడీపీకి నూకలు ఏనాడో చెల్లాయి.
* మరోవైపు రేవంత్ ఇద్దరు శత్రువులతోనూ పోరాడాలి. బీజేపీ తెలంగాణాలో ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. దుబ్బాకలో గెలుపు.., గ్రేటర్ లో ఎక్కువ డివిజన్లు గెలుపుతో బీజేపీ ఆశలు, రాజకీయాలు, మాటలు ఆకాశానికెళ్ళాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో.., రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆరెస్ తో ఒకే విధంగా పోరాడడం రేవంత్ రెడ్డికి అలవాడాలి. ముందు నుండి తన టార్గెట్ టీఆరెస్ మాత్రమే.. కానీ ఇకపై మాత్రం బండి సంజయ్ అండ్ బ్యాచ్.. కేసీఆర్ అండ్ బ్యాచ్ పై సమంగా పోరాడాల్సి ఉంటుంది..!
* వీటన్నిటినీ ఎదుర్కొని రేవంత్ రెడ్డి ఏ మాత్రం నెట్టుకురాగలరు అనేది సందేహమే. భారీ క్రేజ్, బిల్డప్పులు మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి కొన్ని నెలల్లోనే పార్టీపై ముద్ర వేయడం సులువే కానీ.., ప్రజల్లో కాంగ్రెస్ ని లేపడమే అతని పెద్ద సమస్యగా మారనుంది.