విజయవాడ: మరో రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఇసుక దీక్ష పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.
ఇసుకపై చంద్రబాబు చేస్తున్న దీక్షను నిరసిస్తూ వైసిపి పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విజయవాడ బందరు రోడ్డులోని తన క్యాంపు ఆఫీసు సమీపంలో ధర్నా చేపట్టారు. సారధి దీక్షకు మంత్రి రామచంద్రారెడ్డితో పాటు పలువురు వైసిపి ఎమ్మెల్యేలు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఇసుకను అడ్డం పెట్టుకుని చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఇసుక మాఫియాతో దోపిడీకి పాల్పడిన చంద్రబాబుకు అసలు ఇసుక గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని పెద్దిరెడ్డి అన్నారు.