అమరావతి :టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. నిన్న హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో వచ్చిన సమయంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్ ర్యాలీలతో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు.
రాజకీయ పార్టీల ర్యాలీలపై నిషేధం ఉన్నప్పటికీ, చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదని అన్నారు. లాక్ డౌన్ ఆంక్షలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తి జరిగేలా చంద్రబాబు వ్యవహరించాడని పిటిషన్లో పేర్కొన్నారు. బాబుకు ఇచ్చిన అనుమతిని రద్దుచేసి, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండిపోయారు. రెండు నెలల విరామం తర్వాత ఏపీ పోలీసు శాఖ ఇచ్చిన ప్రత్యేక అనుమతితో సోమవారం ఉదయం హైదరాబాద్లో బయలుదేరిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు. అయితే మార్గమధ్యంలో పలుచోట్ల టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జనసమీకరణ చేశారు. ఎక్కడా నేతలు, కార్యకర్తలు మాస్క్లు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండా హడావుడి చేశారు. చంద్రబాబు కాన్యాయ్ ని పలు చూట్ల కార్యకర్తలు ఆపుచేయగా అయన వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.