ఓవైపు కోర్టు చిక్కులు.. మరోవైపు బీజీపీ నుంచి అందని సహకారం.. జనసేన, టీడీపీ నుంచి విమర్శలు, రాజధాని వ్యవహారం.. వీటన్నింటితో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు సీఎం జగన్. అయితే జగన్ కు ఇక మంచి రోజులు రాబోతున్నాయని తెలుస్తోంది. ఆయన అతి త్వరలోనే ఎన్డీఏలో కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేమిటంటే..
రెండు వారాల వ్యవధిలోనే ఢిల్లీకి మళ్లీ మళ్లీ..
జగన్ ఢిల్లీ వెళ్లి రెండు వారాలు కూడా కాలేదు. అదే పర్యటనలో అమిత్ షాను వరుసగా రెండుసార్లు కలిశారు కూడా. కానీ.. తక్కువ వ్యవధిలోనే ఢిల్లీ నుంచి మళ్లీ పిలుపు. ఈసారి ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. ఈనెల 5న ఢిల్లీ వెళ్లి మోదీతో భేటీ అయి విభజన అంశాలపై చర్చించనున్నారు. అమిత్ షాతో భేటీ సందర్భంగానే వైసీపీ ఎన్డీఏలో చేరడంపై ఊహాగానాలు వచ్చాయి. మోదీతో భేటీ అంటే ఇక వైసీపీ కేంద్రంలో చేరడం లాంఛనమే అనిపిస్తోంది. దీనిపై వైసీపీ శ్రేణులు సంబరంగానే ఉన్నా జగన్ కు బాగా దగ్గరైన మైనార్టీ, క్రిస్టియన్ ఓటర్లలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
జగన్ ఎలా డీల్ చేస్తారో..
జగన్ ఎన్డీఏలో కలవడం వల్ల లాభం, నష్టం రెండూ ఉంటాయి. హిందూత్వం నెత్తిన పెట్టుకున్న బీజేపీతో కలిస్తే జగన్ కు మైనార్టీ, క్రిస్టియన్ ఓటు బ్యాంకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు గత ఐదేళ్లు టీడీపీతో కలిసి నడిచిన బీజేపీ ఏపీకి హోదా ఇవ్వలేదని, మోసం చేసిందని ప్రజల్లో ఒక భావన ఉంది. ఇప్పుడు జగన్ కూడా బీజేపీతో కలిస్తే ఆ వ్యతిరేకత జగన్ పై కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే.. తన వ్యూహాలతో చురుకైన రాజకీయ అడుగులు వేస్తున్న జగన్ ఈ అంశాలను, ప్రతికూలతలను ఎలా డీల్ చేస్తారోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.