గాంధీనగర్ – ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును శుక్రవారం గాంధీ నగర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. గత రెండు రోజులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ప్రధాన మంత్రి మోడీ ఈ రోజు ప్రారంభించిన వందే భారత్ రైలు దేశంలో మూడవది. మొదటి రెండు వందే భారత్ రైళ్లు న్యూ ఢిల్లీ – వారణాసి, న్యూఢిల్లీ – శ్రీమాతా వైష్ణోదేవి కత్రా మద్య నడుస్తున్నాయి. నేడు ప్రధాని ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ గుజరాత్ – మహరాష్ట్ర రాజధానులను కలుపుతూ గాంధీనగర్ – ముంబై మధ్య నడుస్తుంది.
ఈ రైలు (20901) ముంబై సెంట్రల్ నుండి ఉదయం 6.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీనగర్ చేరుకుంటుంది. తిరిగి వచ్చే రైలు – 20902 ముంబైకి మధ్యాహ్నం 2.05 గంటలకు చేరుకుంటుది. మరల గాంధీనగర్ నుండి బయలుదేరి రాత్రి 8.35 గంటలకు ముంబై సెంట్రల్ కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ అహ్మదాబాద్ లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించారు. 6 కోచ్ లతో కూడిన ఈ రైలులో 1,128 మంది ప్రయాణికులు కూర్చొనే సామర్ద్యం ఉందనిీ, గాంధీ నగర్ నుండి క్యాపిటల్ స్టేషన్ చేరుకోవడానికి ముందు మూడు స్టేషన్ లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. అత్యంత వైగంగా నడిచే ఈ రైలులో విమానాల్లో మాదిరి అత్యాధునిక సౌకర్యాలతో ఉంటాయి. మెరుగైన ప్రయాణికుల భద్రతా ఫీచర్లు కూడా వందే భారత్ రైలు ప్రత్యేకం. రెండు రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్ టెక్నాలజీని ఇందులో అమర్చారు.
180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లను అమర్చారు. కోచ్ వెలుపలి భాగంలో ప్లాట్ ఫామ్, సీసీ టీవీ కెమెరాలు అమర్చారు. సంప్రదాయ రైళ్లతో పోలిస్తే 30 శాతం తక్కువ విద్యుత్ ను ఈ రైళ్లు వినియోగించుకుంటాయి. ఇంకా వైఫై, మూడు గంటల బ్యాటరీ బ్యాకప్, జిపీఎస్ లు వంటి మెరుగైన సదుపాయాలు ఉన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) ఈ రైళ్లను తయారు చేస్తొంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 75 వందే భారత్ రైళ్లను తయారు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుంది ఐసీఎఫ్.