PM Modi : దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఉన్న ప్రధాని మోదీ,PM Modi అమిత్ షా వంటి బలమైన నాయకులు వ్యవస్థలను శాసించగలరు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఒక్కోసారి కఠిన నిర్ణయాలే కాదు.. సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్.. ఇలాంటి కోవలోకే వస్తాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం, జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని సవరించడం.. కూడా మోదీ హయాంలో జరిగిందే. వీటిలో మోదీ, షా ప్రత్యక్షంగా ఏమీ చేయకపోయినా.. ధృడమైన సంకల్ప బలం ఉన్న నాయకులు దేశానికి ఉంటే ఎటువంటి ఫలితాలు సాధించొచ్చో వీరు నిరూపించారు. అయితే.. కొన్ని నిర్ణయాలు మాత్రం ప్రతికూల ప్రభావాల్ని తీసుకొస్తూంటాయి. అందులో ఒకటి ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ’ అంశం. ప్రస్తుతం ఈ విషయంలో ఏపీ రగిలిపోతోంది.
నీతి ఆయోగ్ చెప్పిందని..
2015 జనవరి 1న దేశంలో ‘నీతి (NITI) ఆయోగ్’ ఏర్పాటయింది. ప్రణాళికా సంఘం స్థానంలో మోదీ ప్రధాని అయిన కొత్తలో ఇది ఏర్పాటయింది. దీనికి అధ్యక్షుడిగా ప్రధాని మోదీ ఉంటారు. దేశంలో ఆర్ధికాంశాల ప్రాధాన్యాన్ని విశ్లేషిస్తూ సూచనలివ్వడమే నీతి ఆయోగ్ పని. ఇందులో పారిశ్రమికం, సాంకేతికత, ఆర్ధిక పురోగతి, భాగస్వామ్య పాలన, అవకాశాల కల్పన వంటి విషయాలను అధ్యయనం చేస్తూ సలహాలిస్తుంది. ఇదే నీతి అయోగ్.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో కీలక పాత్ర పోషించింది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల్ని అధ్యయనం చేసిన నీతి ఆయోగ్ విశాఖ స్టీల్ నష్టాల్లో ఉందని తేల్చింది. అందుకే ప్రైవేటీకరణకు కేంద్రం ముందడుగు వేస్తోంది. దేశ ఆర్ధిక పురోభివృద్ధి కోసమే ఈ నిర్ణయమని చెప్పారు. ఇటివల హైదరాబాద్ లో జరిగిన కేంద్ర బడ్జెట్ పై చర్చా గోష్టి కార్యక్రమంలో ఆయన వివరాలు వెల్లడించారు. అప్పటికే ఏపీలో విశాఖ ఉక్కు అంశం ప్రకంపనలు రేపుతోంది.
ఎపీ అంటేనే ఎందుకిలా..?
అయితే.. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా వచ్చే ఆలోచన ఏంటంటే.. విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని చెప్పిన నీతి ఆయోగ్ కి మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో ఉన్న గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (GSPC) నష్టాల్లో ఉందని తెలీదా అని. అయితే.. GSPCని మాత్రం ప్రైవేటుపరం చేయలేదు. ఇందులో వచ్చిన నష్టాలను పూడ్చేందుకు దేశంలోని అగ్రగామి పెట్రోలియం సంస్థల్లో ఒకటైన ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్జీసీ (ONGC)తో పెట్టుబడులు పెట్టించారు. దాదాపు 8వేల కోట్లు పెట్టి వాటా కొనుగోలు చేయించి GSPC నష్టాలను పూడ్చారు. పైకి GSPCలో ONGC పెట్టుబడి పెట్టినట్టు కనిపిస్తున్నా.. GSPC నష్టాలు పూడ్చేందుకు.. ప్రైవేటుపరం కానివ్వకుండా ఉండేందుకే మోదీ స్థానిక మంత్రంపై చక్రం తిప్పారని ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. అది నిజమే అయితే.. విశాఖ ఉక్కు కర్మాగారంలో నష్టాలు వస్తున్నాయని చెప్పి ప్రైవేటీకరించే బదులు NMDC లేదా SAIL చేత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను మాతృ కంపెనీ అయిన RINL లో పెట్టుబడి పెట్టించి వైజాగ్ స్టీల్ ని ఆదుకోవచ్చు కదా? అనేది ఓ వాదన.
దేశంలో అన్ని రాష్ట్రాలు ఒకటి కాదా..?
ఇదంతా పెద్ద బిజినెస్ స్ట్రాటజీ అయినా.. స్థూలంగా చెప్పుకుంటే మోదీ సొంత రాష్ట్రంపై చూపిస్తున్న ప్రేమను మిగిలిన రాష్ట్రాలు.. అక్కడి ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలపై చూపడం లేదని చెప్పాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఘనమైన చరిత్ర ఉంది. దేశంలో మరే స్టీల్ ప్లాంట్ కూడా సముద్ర తీరాన లేదు. విశాఖ స్టీల్.. ఉద్యమాలు, 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటయింది. ఇంతటి ఉద్యమాలకు తలొగ్గి ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దాదాపు అవే స్థాయి ఉద్యమాలు జరుగుతున్నాయని తెలుస్తున్నా కేంద్రం వెనక్కు తగ్గుతుందా అనేది ప్రశ్న. ఇంతవరకూ ప్రధాని ఈ అంశంపై స్పందించ లేదు. అహ్మదాబాద్ కు సమీపంలోని ఢొలెరాలో మోదీ కొత్త నగరాన్నే సృష్టిస్తున్నారు. బుల్లెట్ రైలు తీసుకొస్తున్నారు. సీఎంగా రాష్ట్రానికి ఎంతో చేశారని పేరున్న మోదీ ఇప్పుడు ప్రధాని హోదాలో దేశం మొత్తాన్ని చూసుకోవాలి. ఏడేళ్లుగా దేశాభివృద్ధికి మోదీ చూపిన చొరవ.. ఆయన నిబద్ధతను తప్పు పట్టలేం. కానీ.. భావోద్వేగమైన అంశాల్లో గుజరాత్ ఎలానో.. ఏపీ కూడా మోదీకి అలానే ఉండాలనేది నిర్వివాదాంశం.