(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయి. కానీ, కలిసి పనిచేయడం జరిగే పని కాదు” అని మోదీతో తాను అన్నట్లు తెలిపారు. తనకు రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్తలు మాత్రం అవాస్తవమని అన్నారు. తన కుమార్తె సుప్రియా సూలేను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే విషయం మాత్రం చర్చకు వచ్చిందని చెప్పారు. ఈ మేరకు ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో శరద్ పవార్ తెలిపారు. ప్రధాని మోదీతో తన భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన కొన్ని విషయాలను శరద్ పవార్ వెల్లడించారు.
మహారాష్ట్రలో ఇటీవల రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సమయంలో బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో శరద్ పవార్ న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శరద్ పవార్ బీజేపీతో కలుస్తారని, ఆయనకు రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, అనంతరం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.