ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ ఒకటిన రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రకటిస్తారన్న ఊహాగానాలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. మోదీ ఒకటవ తేదీన విశాఖపట్నం రానున్నారు. అధికారిక కార్యక్రమం పెట్టుకుని వస్తున్న ప్రధాని విశాఖలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
బిజెపి కార్యక్రమమైన ఈ సభలో మోదీ నవ్యాంధ్రకు రైల్వే జోన్ ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రెడిట్ తెలుగుదేశం ప్రభుత్వానికి చెందకూడదన్న కారణంతోనే ముందుగా రాష్ట్ర బిజెపి ప్రతినిధిబృందాన్ని రైల్వే మంత్రి దగ్గరకు పిలిపించుకున్నట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సారధ్యంలో మొన్న రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ను కలిసి రైల్వే జోన్ ప్రకటించాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఇదంతా ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం జరిగిందేనని అంటున్నారు. రాష్ట్ర విభజన వాగ్దానాల అమలు విషయంలో మోదీ ప్రభుత్వం ఆడిన మాట తప్పిందని ఆరోపిస్తూ ఎన్డిఎ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు ఎలాంటి క్రెడిట్ దక్కకూడదన్నది ఈ వ్యూహం లక్ష్యంగా చెబుతున్నారు.
బిజిపితో తెగతెంపులు చేసుకున్న తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకత్వంపై విరుచుకు పడుతున్నారు. మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దానికి జవాబుగా అన్నట్లు మోదీ ఇటీవల గుంటూరులో బహిరంగసభలో మాట్లాడారు. చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా లోకేష్ తండ్రి అంటూ ఆయన విరుచుకుపడ్డారు. అయితే ఆయన చేసిన విమర్శలలో హుందాతనం లోపించిందనీ, ప్రధాని స్థాయి వ్యక్తి అలా విమర్శించడం తప్పనీ రాజకీయవర్గాలలో వినబడింది. ప్రధాని విమర్శ తీరుకు నొచ్చుకున్న చంద్రబాబు తాను నరేంద్ర మోదీ భార్య ప్రస్తావన తీసుకువస్తే ఎలా ఉంటుందని అనకుండా ఉండలేకపోయారు.
తాజాగా కూడా, చేసిన వాగ్దానాల గురించి మాట్లాడకుండా మళ్లీ తిట్టడానికా ప్రధాని వస్తున్నది అంటూ చంద్రబాబు ప్రధాని విశాఖ పర్యటనపై వ్యాఖ్యానించారు. గుంటూరు సభలో ప్రధాని విభజన చట్టం హామీల గురించి కనీసం ఒకటి రెండు ప్రకటనలన్నా చేస్తారని బిజెపి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే మోదీ చంద్రబాబుపై విమర్శలకే పరిమితమైపోయారు. ఇప్పుడు విశాఖలోనన్నా ఆయన తమ పరువు నిలుపుతారేమోనని రాష్ట్ర బిజెపి నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
కొసమెరుపేమిటంటే, ఇంతవరకూ ప్రధాని అధికారిక పర్యటన వివరాలు విశాఖ అధికార యంత్రాంగానికి అందలేదు.