కర్నూలు, మార్చి 29: ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) కట్టుబడి పని చేసిందని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబే లక్ష్యంగా ప్రధాని మోది విమర్శలు గుప్పించారు.
రాష్ట్రానికి ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగితే బాబు యుటర్న్ తీసుకున్నారని మోది విమర్శించారు. దేశాన్ని నష్టపర్చాలనుకుంటున్న వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి కాకుండా కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారని మోది విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాలు అవినీతి మయం అయ్యాయని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేసింది, విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణకు పెద్ద ఎత్తున నిధులు, కడప, రాజమండ్రి విమానాశ్రయాల విస్తరణకు చర్యలు తీసుకుంది ఈ చౌకీదార్ కాదా అని ప్రశ్నించారు.
అదే విధంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఐఐఎం, ఐఐటి, ఎయిమ్స్ తదితర సంస్థలు మంజూరు చేసింది ఎవరు అని మోది ప్రశ్నించారు. ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల లక్షలాది మంది లబ్దిపొందారని మోది పేర్కొన్నారు. ఇక్కడ పాలకుల దుర్నీతి కారణంగానే ప్రజలు ఇంకా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మోది అన్నారు. రాష్ట్రానికి ఇంకా చేయాలని తనకు ఉన్నాగానీ ఇక్కడి యుటర్న్ బాబు స్వార్థ రాజకీయం కోసం సహకరించలేదని మోది విమర్శించారు.
రాయలసీమకు ద్రోహం చేస్తున్న వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మోది పిలుపు ఇచ్చారు. రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమ అంటూ కర్నూలుకు ప్రధాని రావడం అదృష్టంగా భావిస్తున్నానని మోది తొలుత పేర్కొన్నారు. సభలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాజ్యసభ సభ్యులు, ఎంపిలు, తదితరులు పాల్గొన్నారు.