దేశ ప్రధానిగా మోదీ అప్రతిహత విజయాల్లో కీలకపాత్ర పోషించింది ‘సోషల్ మీడియా’. 2014 ఎన్నికల సమయంలో మోదీకి మీడియా దాదాపు 80 శాతం సపోర్ట్ గా నిలిచి ఆయన విజయానికి కారణమయ్యాయి. 2019 ఎన్నికల్లో కూడా మోదీ విజయానికి ఇవే కారణమయ్యాయి. నిజానికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచే మీడియా, సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర నాయకుడి నుంచి జాతీయస్థాయి నాయకుడిగా మోదీ ఎదగడంలో మీడియా, సోషల్ మీడియా కీలకపాత్ర పోషించింది. దీనివల్ల మోదీకి బీజేపీ బలం కాకపోగా.. బీజేపీకే మోదీ బలమయ్యారు. ఇప్పటికీ ఆయనను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారి సంఖ్య అనూహ్యం.
సోషల్ మీడియా స్టార్.. మోదీ
భారత్ లో సోషల్ మీడియాకు సంబంధించి అత్యధిక ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీనే నెంబర్ వన్. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య చాలా ఎక్కువ. దేశ రాజకీయాల్లో మోదీ ఎంతటి ప్రభావం చూపగలరో సోషల్ మీడియాలోనూ అంతే ప్రభావం చూపిస్తారు. ట్విట్టర్లో ఆయనకు 63 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 49 మిలియన్లు, ఫేస్ బుక్ లో 45 మిలియన్లు, యూట్యూబ్ లో 7మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆయన క్రేజ్ ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మోదీ మన్ కీ బాత్ కి భారీస్థాయిలో క్రేజ్ ఉంది. ఆయన సోషల్ మీడియా పోస్ట్ కు లైక్స్ కూడా అదేస్థాయిలో వస్తాయి.
గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి.. భారత ప్రధాని వరకూ..
2001 నుంచి 2014 వరకూ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇన్నేళ్ల కాలంలో గుజరాత్ లో చేసిన అభివృద్ధి దేశం దృష్టిని ఆకర్షించింది. 2002లో ఎన్నికల్లో విజయం తర్వాత నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమి సాగులోకి తెచ్చారు. తాగునీటి సరఫరా, జల విద్యుత్పై శ్రద్ధ చూపినారు. అనేక మహిళా పథకాలను చేపట్టారు. పెట్టుబడులను రప్పించడం, పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతుల్లో గుజరాత్ ను అగ్రస్థానంలో నిలిపారు. ‘భారతదేశపు అభివృద్ధి గుజరాత్లో కనిపిస్తోంది’ అంటూ 2011లో మోదీ పరిపాలనను అమెరికా శ్లాఘించింది. 2002 ఉప ఎన్నికలు, 2007 ఎన్నికలు, 2012 ఎన్నికల్లో మోదీ వల్లే బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. మీడియాను, సోషల్ మీడియా విస్తృతమయ్యాక ఆ వ్యవస్థను మోదీ ఉపయోగించిన తీరుగా దేశంలోని మరే రాజకీయ నాయకుడూ ఉపయోగించలేదంటే అతిశయోక్తి లేదు.