హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ శాసన సభాపతిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా పోచారంను ఎన్నుకోవడంతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ శుక్రవారం ఆయనను స్పీకర్గా ప్రకటించారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, మజ్లిస్ సభ్యుడు అహ్మద్ బలాల, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు రేఖానాయక్, అబ్రహం, తలసాని శ్రీనివాస్ యాదవ్లు పోచారం అభ్యర్ధిత్వాన్ని గురువారం ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి వినతి మేరకు కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎంలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. దీంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవమైంది.
తెలంగాణ ఉద్యమంలోకి రావాలనే కెసిఆర్ పిలుపుతో 2011లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన పోచారం టిఆర్ఎస్
లో చేరారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం తెరాస పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులయ్యారు. 2014లో టిఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణా తొలి వ్యవసాయశాఖా మంత్రిగా ఆయన పనిచేశారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
1949 ఫిబ్రవరి 10న నిజామాబాద్ జిల్లా, బాన్సువాడ మండలం, పోచారం గ్రామంలో ఆయన జన్మించారు. పరిగె రాజిరెడ్డి, పాపవ్వ తల్లిదండ్రులు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇప్పటివరకు ఆయన ఆరు సార్లు బాన్సువాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పోచారం ఇంజనీరింగ్ విద్యకు మధ్యలోనే స్వస్థి చెప్పి 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1976లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1977 దేశాయిపేట సింగిల్ విండో ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1987లో డిసిసిబి చైర్మన్గా పనిచేశారు. 1989లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 1992లో టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. 1994లో బాన్సువాడ ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. 1998లో గృహ నిర్మాణ శాఖామంత్రిగా, 1999 మళ్లీ అదే నియోజకవర్గం నుండి గెలిచి భూగర్భ గనుల శాఖామంత్రిగా, 2001-2002లో గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి గోవర్ధన్ చేతిలో ఓటమి చెందారు. 2005నుంచి 2007వరకు టిడిపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో బాన్సువాడనుంచి టిడిపి తరపున శాసన సభ్యుడిగా గెలిచారు.