పోలవరం ప్రాజెక్టు వైసిపి ప్రభుత్వానికి పెను భారంగా మారే సూచనలు గోచరిస్తున్నాయి.ఈ ప్రాజెక్టు విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కారుకు షాక్ ఇచ్చింది.పోలవరం ప్రాజెక్టుకయ్యే నిర్మాణ వ్యయాన్ని మాత్రమే కేంద్రం ఇస్తుందని,నిర్వాసితుల నష్టపరిహారం ప్యాకేజీతో తమకు సంబంధమే లేదని కేంద్రం స్పష్టం చేసింది.ఈ లెక్కన చూస్తే పోలవరం మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం 52 వేల కోట్లు , ఇప్పుడు కేంద్రం చెపుతున్న దాని ప్రకారం 22 వేల కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది.దీనితో మిగిలిన 30 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.
కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది సాధ్యమయ్యే పని కాదు.ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు విషయంలో టిడిపి చేసిన తప్పిదాలే తమ మెడకు చుట్టుకుంటున్నాయని వైసీపీ వాదన లేవదీసింది.రాజకీయ ప్రయోజనాల కోసం అప్పట్లో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న టిడిపి ఆనాడే కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని షరతులు పెట్టగా వాటిని కప్పిపుచ్చిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. 2013-14 తర్వాత ప్రాజెక్టు వ్యయం, భూమి ధర పెరిగినా ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించబోమని కేంద్రం బాబు ప్రభుత్వానికి స్పష్టం చేసిందని తెలిపారు.దాన్ని చంద్రబాబు ప్రభుత్వం దాచి పెట్టిందని తెలిపారు.ఈ నేపధ్యంలో తప్పంతా టిడిపిపై నెట్టేసే కార్యక్రమం మొదలైంది. అయితే వైసిపి వాదనలో కూడా కొంత నిజం లేకపోలేదు. నిజానికి పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని మేమే నిర్మించి ఇస్తామని కేంద్రం అప్పట్లో ప్రకటించింది.
అయితే ఆనాడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం తాము ప్రాజెక్టును కడతామని కేవలం నిధులు మాత్రమే ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఒప్పించుకుంది.దాదాపు 58వేల కోట్ల రూపాయల మేర ప్రాజెక్టు నిర్మాణ వ్యయ ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది.పనులు చాలా చురుగ్గా దొరుకుతున్నాయన్న బిల్డప్ ఇచ్చింది.చంద్రబాబు అప్పట్లో ప్రతి సోమవారాన్ని పోలవారంగా ప్రకటించి సమీక్ష జరిపేవారు.చివరకు పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో చంద్రబాబు ప్రభుత్వం బస్సులు వేసి వేసి మరీ పర్యాటకులను అక్కడకి పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చినట్లే చెప్పుకుంటూవచ్చింది . టిడిపితో తెగదెంపులయ్యాక ప్రధాని నరేంద్రమోడీ ఒక సందర్భంలో పోలవరం ప్రాజెక్టు బాబు ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందని విమర్శలు కూడా గుప్పించారు.
ఇంతలో ప్రభుత్వం మారింది. జగన్ అధికారంలోకి రాగానే రివర్స్ టెండర్ ప్రక్రియ ప్రారంభించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని యాభై రెండు వేల కోట్లకు కుదించారు.ఆ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాక ఇప్పుడు మెలిక పెట్టారు.బాబు ప్రభుత్వం తప్పు చేసినా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో బాధ్యత వహించాల్సింది జగన్ ప్రభుత్వమే కాబట్టి ఈ మ్యాటర్ ని ముఖ్యమంత్రి ఎలా డీల్ చేస్తారో చూడాలి.పోలవరం విషయంలో కేంద్రంపై జగన్ పోరాడని పక్షంలో ఆయనకు రాష్ట్రంలో రాజకీయంగా నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది.ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ కి ఇది కత్తిమీద సామే!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?