ఏపీ అధికార పార్టీ వైసీపీకి పక్కలో బల్లెం లాగా మారిన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. పార్టీ హైకమాండ్ కు వ్యతిరేకంగా మీడియా ముందు వైసీపీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేయడంతో పార్టీ షోకాజ్ నోటీసులు రఘురామకృష్ణంరాజుకి ఇటీవల పార్టీ పెద్దలు ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. అంతేకాకుండా పార్లమెంట్ పరిధిలో పార్టీపరంగా రఘురామకృష్ణంరాజుకి కేటాయించిన పదవుల నుండి తొలగించాలని ఇప్పటికే స్పీకర్ కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా రఘురామకృష్ణంరాజు ని మరింత ఇరుకున పెట్టే విధంగా వైసీపీ నేతలు పోలీస్ కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. వైసీపీ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు తనని రఘురామకృష్ణంరాజు ఎలాంటి కారణం లేకుండా పరువు భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ పోడూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఎమ్.పి పై చర్యలు తీసుకోవాలని రంగనాద రాజు కోరారు. కాగా దీనిపై రఘురాజు స్పందిస్తూ మంత్రి తనపై పోలీసులకు పిర్యాదుచేయడం తగదని అన్నారు. అప్పట్లో తన దిష్టిబొమ్మను దహనం చేస్తే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మంత్రి ఫిర్యాదు విషయంలో పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.