TRS Counselor Murder: తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో అధికార పార్టీ టిఆర్ఎస్ కౌన్సిలర్ బానోతు రవి నాయక్ హత్యకు గురి కావడం తెలిసిందే. టిఆర్ఎస్ కౌన్సిలర్ రవి బైక్ పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు. గొడ్డలితో విచక్షణరహితంగా.. మాటు వేసిన దుండగులు.. ఒక్కసారిగా.. టిఆర్ఎస్ కౌన్సిలర్ పై ఎటాక్ చేసి హత్య చేయటం జిల్లాలోనే సంచలనంగా మారింది. ఈ క్రమంలో రక్తపు మడుగులో పడి ఉన్న రవిని స్థానికులు ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
గిరిజన కౌన్సిలర్ కావటంతో పాటు అధికార పార్టీకి చెందిన నేత కావడంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కౌన్సిలర్ రవి హత్య కేసు 24 గంటల్లోనే ఛేదించారు. హత్యతో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యలో వినయ్, అరుణ్ ప్రధాన నిందితులుగా మిగిలిన ఐదుగురికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.
భూక్యా వినయ్ కుమార్, భూక్యా అరుణ్, అజ్మిరా బాలరాజు, గుగులోతు చింటూ, కారపాటి సుమంత్, అజ్మిరా కుమార్, గుగులోతు భావు సింగ్లు నిందితులుగా పోలీసులు వెల్లడించారు. అయితే గతంలో ఈ నిందితులు రవితో కలసి అక్రమ వ్యాపారాలు చేయడం జరిగింది. అనంతరం విభేదాలు వచ్చాక రవి తో విడిపోయిన తరువాత .. నిందితులు సొంతంగా కలప బియ్యం వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇది గిట్టని రవి పోలీసులకు పట్టిస్తున్నాడు అన్న కోపంతోనే… రవిని హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ స్పష్టం చేశారు. మరోపక్క ఈ హత్య కేసుకు సంబంధించి టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాత్ర కూడా ఉన్నట్లు జిల్లాలో టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ ఎమ్మెల్యే అండ చూసుకుని నిందితులు నడిరోడ్డుపై అతి కిరాతకంగా చంపినట్లు టిఆర్ఎస్ కౌన్సిలర్ హత్య కి సంబంధించి గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి.