తెలంగాణ రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి తెర లేచింది. అసలు మాకు ప్రత్యర్ధులే లేరు.. మాకు పోటీ లేదు అనుకుంటున్న టీఆర్ఎస్ కు ఇన్నేళ్లకు బీజేపీ ఎదురు నిలిచింది. రెండేళ్ల క్రితం 60వేల ఆధిక్యతతో గెలుచుకున్న సీటును టీఆర్ఎస్ కోల్పోతే.. డిపాజిట్ తెచ్చుకోలేకపోయిన బీజేపీ ఇప్పుడు అక్కడ గెలిచింది. అంటే.. తెలంగాణలో బీజేపీ బలపడిందా.. టీఆర్ఎస్ బలహీనపడిందా..? అసలు దుబ్బాకలో గెలుపోటములు ఎవరు చేసిన పాపం అనేది.. కీలకమైన చర్చకు దారి తీస్తోంది. ఎవరేమనుకున్నా ఇక్కడ గెలిచింది బీజేపీ కాదు.. రఘునందన్ రావు మాత్రమే. ఓడింది.. అధికార పార్టీ కాదు.. టీఆర్ఎస్ మాత్రమే. టీఆర్ఎస్, రఘు నేర్చుకున్న పాఠాలు దుబ్బాక ఫలితాన్ని శాసించాయి.
బీజేపీది వాపా.. గెలుపా..?
నిజానికి తెలంగాణలో బీజేపీకి ఉనికి మాత్రమే ఉంది. బలం లేదు. కార్యకర్తల బలం గానీ,, నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి బలంగానీ బీజేపీకి లేవు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి 2018లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. రఘునందన్ కూడా గతంలో రెండుసార్లు ఓడిపోయారు. బూత్ స్థాయిలో ఏజెంట్లను పెట్టుకునే స్థాయి కూడా లేదు. అంత బలహీనంగా ఉన్న బీజేపీ దుబ్బాకలో గెలిచిందంటే కారణం.. రఘునందన్ కు ఉన్న పరిచయాలు, సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పాలి. దీంతో ఇది బీజేపీ బలం అయితే కాదు.. బలం పెంచుకున్నట్టు కాదు. కానీ.. బీజేపీకి ఇదొక అవకాశం అని మాత్రం చెప్పాలి. అదేస్థాయిలో టీఆర్ఎస్ ఈ ఓటమి నుంచి ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకుంటుందని చెప్పాలి. సాఫీగా సాగిపోయే నావకు చిల్లు పడితే పరిస్థితి తెలిసిందే కదా..!
ప్రతిపక్షానికి ఊపిరిలూదిన దుబ్బాక..!
2014 రాష్ట్ర ఆవిర్భావం.. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రతిపక్షమే లేదు. తాము చెప్పిందే వేదం.. తాము చేసేదే సంక్షేమం అన్నట్టుగా సాగింది టీఆర్ఎస్ పాలన. ‘ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం’ అని కేటీఆర్ చెప్పినే మాటే కొత్తగా ఉంది. ఏదేమైనా తెలంగాణలో ప్రతిపక్షం ఉనికికి తలుపులు తెరిచింది దుబ్బాక. తెలంగాణ ఉద్యమం కొత్త రాష్ట్ర ఆవిర్భావానికి దారి తీసినట్టు.. ‘దుబ్బాక’ ఉప ఎన్నిక ఫలితం కొత్త రాజకీయ వ్యవస్థకు ఊపిరిలూదిందని చెప్పాల్సిందే. అప్పుడు తెలంగాణ కోసం ఒక్కతాటిపై కదలిన ప్రజలు.. ఇప్పుడు అదే తెలంగాణలో వ్యక్తి స్వామ్యానికి స్వస్తి పలికి స్వేచ్ఛ వాయువులకు అవకాశం ఇస్తే సరికొత్త రాజకీయ వ్యవస్థ సాధ్యమే..!