Kazipet Rail Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ Kazipet Rail Coach Factory.. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నెరవేర్చడం తక్కువే. ఇందులో అనేక అంశాలపై ఏపీ ఇంకా గొంతెత్తి పోరాడుతూనే ఉంది. ఇప్పుడు తెలంగాణ కూడా తమ రాష్ట్రం కోసం గొంతెత్తుతోంది. కాజీపేట రైల్వే కోచ్ కర్మాగారం ఇస్తామని ఆనాడు ప్రకటించి నేటికీ నెరవేర్చలేదు.
సమచార హక్కు చట్టం ద్వారా ఓవ్యక్తి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇచ్చింది. తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీకి అనువైన ప్రదేశం కాదనీ.. దేశంలో ఎక్కడా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని తేల్చేసింది. ఇప్పుడు ఈ అంశంలపై తెలంగాణలో రాజకీయ కాక మొదలవుతోంది.
మంత్రి కేటీఆర్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడమే ఇందుకు ఉదాహరణ. విభజన హామీలో భాగంగా వరంగల్ జిల్లాలోని ఖాజీపేటకు రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేస్తామని ఆనాడు యూపీఏ హామీ ఇచ్చిందని.. ఇప్పుడు ఎన్డీఏ ఇవ్వకుడా మోసం చేసిందని అన్నారు. ఆ ప్రాజెక్టు అవసరమే లేదని చెప్పడం ఎంతవరకూ సమంజసం అంటూ ఫైర్ అయ్యారు. ప్రాజెక్టును రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదని.. దీనిపై పోరాటానికి సిద్ధమంటూ ప్రకటించారు. సీఎం కేసీఆర్ అనుమతి తీసుకుని తమ కార్యాచరణపై ముందుకెళ్తామని అంటున్నారు. ఇక దీనిపై కాంగ్రెస్ కూడా స్పందించింది.
తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇన్నాళ్లూ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదని కౌంటర్ చేస్తోంది. కమీషన్లు దక్కే ప్రాజెక్టు కానందువల్లే సీఎం కేసీఆర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని విస్మరించారంటూ విమర్శించారు.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓవైపు రైల్వేను ప్రైవేటీకరణ చేద్దామని బీజేపీ చూస్తూంటే ఇక కోచ్ ఫ్యాక్టరీ పెట్టే ఉద్దేశం ఏముంటుందని అంటున్నారు. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ బీజేపీ మెడకు చుట్టుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ బీజేపీ నుంచి ఇంకా సమాధానం రాలేదు. సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో.. బీజేపీ ప్రభుత్వంపై ఎలా పోరాడతారో చూడాల్సి ఉంది