ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…..
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
బిసిలను టిడిపి ఓటు బ్యాంకుగానే చూసింది. వారి అభివృద్ధికి పాటుపడలేదు. జనాభా ప్రాతిపదికన బిసిలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని సిఎం భావిస్తే టిడిపి నేతలు సైంధవుల్లా అడ్డుపడ్డారు. బిసిలపై వారికి ఉన్న ప్రేమ ఏపాటిదో బట్టబయలు అయ్యింది.
వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి టిడిపి అధినేత చంద్రబాబు వ్యతిరేకి. స్థానిక ఎన్నికలు జరగకుండా కోర్టులో పిటిషన్ వేయించారు. బిసిల అభివృద్ధికి సిఎం జగన్ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు.
బిజెపి రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి
శ్రీవాణి ట్రస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు హారతి తీసివేయడం సముచితం కాదు. పదివేల రూపాయలు విరాళంగా ఇస్తున్న భక్తులకు గతంలో మాదిరిగానే దర్శనభాగ్యం కల్పించాలి. ప్రభుత్వం పాస్టర్లకు ఇస్తున్న తరహాలోనే శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఆలయాల ధూపధీప నైవేద్యానికి వెచ్చించాలి.
వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి
అణగారిన వర్గాల పట్ల బాబు ద్వేషం మరోసారి బైటపడింది. వారిని వోట్ బ్యాంక్ గా చూడటం తప్ప రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చాలన్న చిత్తశుద్ధి ఏనాడూ లేదు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85% రిజర్వేషన్ల అమలుకు సీఎం జగన్ గారు నిర్ణయిస్తే కోర్టులో కేసు వేయించి కొట్టేయించాడు.
‘అంగిట బెల్లం ఆత్మలో విషం’ అనేది చంద్రబాబు నైజాన్నివర్ణించడానికే పుట్టింది. పైకి ఎక్కడలేని ప్రేమ నటిస్తాడు.చేసేవి మాత్రం బీసీలను అణగదొక్కే పనులు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా, ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటాడు. తన వర్గం తప్ప బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశాడు.
టిడిపి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు
బిసిలకు 15వేల పదవులు రాకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కుట్ర చేస్తున్నారు. 59.5 శాతం రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలి. ఏపి రాష్ట్ర పరువును పోలీసు వ్యవస్థ మంటగలుపుతోంది. కోర్టుకు డీజిపి హజరవుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
బిసి రిజర్వేషన్లపై జగన్కు చిత్తశుద్ది ఉంటే సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలి. స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు తగ్గించకుండా ప్రధానికి లేఖ రాయాలి. సిఏఏ, ఎన్ఆర్సికి వ్యతిరేకంగా వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా అవసరం లేదు. 13 రాష్ట్రాల మాదిరిగా ఏపి అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలి.
డిప్యూటి సిఎం నారాయణ స్వామి
మహిళల రక్షణ కోసమే ప్రభుత్వం మద్యపాన నిషేదం నిర్ణయం తీసుకున్నది. మద్యం బాటిళ్లకు కమీషన్లు తీసుకోవాల్సిన కర్మ వైసిపికి పట్టలేదు. మద్యపాన నిషేదం నిర్ణయం వల్ల మహిళలు సంతోషంగా ఉన్నారు. తాగుబోతుల సంఘం అధ్యక్షుడుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.
ఏపీఐఐసి చైర్ పర్సన్ ఆర్.కె.రోజా
టీడీపి నాయకులకు అధికారం పోయాక పిచ్చెక్కింది. బార్ సేల్స్ మేన్ లా బొండా ఉమ మాట్లాడుతున్నారు. డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్ళి వాళ్ళను క్యూర్ చేయాలి. 43వేల బెల్ట్ షాపులు తీసేసిన ఘనత జగన్ సాధించారు. 20శాతం వైన్ షాపులు, 40 శాతం బార్లు తగ్గించారు. మహిళల మంచి కోసం జగన్ ఆలోచిస్తున్నారు. నారా వారి పాలన ఐదు సంవత్సరాలు సారావారి పాలనలా ఉంది. బీర్ ను హెల్త్ డ్రింక్ అని ప్రమోట్ చేసారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?