ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…..
ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా
చంద్రబాబు, లోకేష్తో సహా అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలంతా జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అమరావతి ఉద్యమం ముసుగులో చంద్రబాబు రౌడీయిజం చేయిస్తున్నారు. దళిత ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తున్నారు. తప్పు చేయనప్పుడు చంద్రబాబుకు భయమెందుకు. తప్పు చేశారు కాబట్టే ఐటీ దాడుల్లో టీడీపీ నేతలు దొరుకుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.
ఎపీసిసి నేత తులసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ముఖ్యమంత్రి జగన్కు బానిసల్లా మారారు. చంద్రబాబునాయుడి విశాఖ పర్యటనను అడ్డుకోవాలని మంత్రులు పిలుపునివ్వడం అప్రజాస్వామికం. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న మంత్రులను తక్షణమే అరెస్టు చేయాలి. ముఖ్యమంత్రి జగన్ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
9 నెలల నుండి తుగ్లక్ సమేత వైకాపా పరివారం “గో బ్యాక్” అంటూనే ఉన్నారు. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమకి రావాల్సిన కంపెనీలు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. విశాఖ ప్రమాదకరమైన ప్రాంతం అంటూ జిఎన్ రావ్ కమిటీతో రిపోర్ట్ రాయించి ఉత్తరాంధ్ర యువతకి రావాల్సిన ఉద్యోగాలను “గో బ్యాక్” అని తరిమేశారు. హుద్ హుద్, తిత్లీ వచ్చినప్పుడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా రాని వ్యక్తి ఇప్పుడు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా?.
మాజీ మంత్రి సోమిరెడ్డి
విశాఖలో చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.
అడ్డుకున్నోళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులే. ప్రతిపక్ష నేత ప్రజల్లోకి పోకుండా ఆంక్షలు పెట్టడం దుర్మార్గం.
జగన్ ప్రాపకం కోసం మంత్రులే ఈ నీచానికి దిగజారారు. పోలీసు శాఖ, వైసీపీ నేతల కనుసన్నల్లో నడవాల్సి రావడం దురదృష్టకరం.
టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్
తమ పార్టీ అధినేత వస్తున్న సందర్బంగా విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చాము. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తాము పాల్పడలేదు.పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు.
టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు
హుదుద్కి అతలాకుతలమైన విశాఖని పునర్ నిర్మించిన దార్శనికుడు చంద్రబాబు. తితిలీతో సర్వనాశమైన ఉద్దానానికి పూర్వవైభవం తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబునాయుడిని విశాఖ వాసులు అడ్డుకుంటారంటే ఎవరైనా నమ్ముతారా?. ప్రశాంత ఉత్తరాంధ్రని అల్లకల్లోలం చేస్తున్నది పులివెందుల ఫ్యాక్షన్ ముఠాలే.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి
కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు!
మంత్రి బొత్స సత్యనారాయణ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటనను రాజకీయానికి వాడుకోవాలని చూశారు. విశాఖలో రెండు పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు చంద్రబాబు విశాఖ వచ్చారు.వచ్చారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాము. చంద్రబాబు తన ఉన్మాదాన్ని ప్రజలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ గుండాలతో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న వైజాగ్లో చంద్రబాబు అరాచకం సృష్టించాలని చూస్తున్నారు.
వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు
వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు నేడు ప్రజాగ్రహాన్ని చవిచూశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి.. బాబు కుళ్లుబుద్ధికి మధ్య పోరాటం జరుగుతోంది. వైజాగ్ వెళ్లి అమరావతి జిందాబాద్ అంటూ రెచ్చ గొడుతున్నారు. ఉత్తరాంధ్రలో రాజధాని వద్దని చెపితే చంద్రబాబును మేళతాళాలతో స్వాగతిస్తారా?. ఉత్తరాంధ్ర నాశనం చేస్తానంటే అక్కడ ప్రజలు స్వాగతిస్తారా?. చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు వెనక్కి పంపేశారు. గతంలో హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలికి వెళ్తే ఎయిర్ పోర్ట్ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బయటకు రానివ్వలేదు. వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు ప్రజలు వస్తే రన్వే మీద అడ్డుకున్న విషయాన్ని మర్చిపోవద్దు.