ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మూడు రాజధానుల అంశం ప్రకంపనలు రేపుతోంది. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం రాజదాని వికేంద్రీకరణను కోరుకుంటోంది. టీడీపీ, అమరావతి ప్రాంత రైతులు, మరొకొన్ని వర్గాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎవరి వదన వారు వినిపిస్తున్నారు. మీడియా కూడా అనేక డిబేట్లు నిర్వహిస్తోంది. కొంతమంది రాజకీయ నాయకులు రాజధాని రాజకీయాలపై వింతలు, విశేషాలతో రక్తి కట్టిస్తున్నారు. రాజధాని విశాఖకు రావడంపై 62శాతం మంది వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి హాట్ టాపిక్ గా మారాయి.
62 శాతం వ్యతిరేకత.. ఏలెక్క.. ఏలాజిక్కు..
సబ్బం హరి ఓ మీడియా చానెల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖకు రాజధానిపై ఓ ప్రైవేటు సంస్థ, జగన్ కు చెందిన మీడియా చేసిన సర్వేలో ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వెనుక రాజకీయ ఉద్దేశమే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం కరోనా సమయంలో తమ పనులు తాము చేసుకోవడానికే భయపడుతున్న పరిస్థితులు. ఇప్పుడు సర్వే చేసింది ఎవరు.. ఎక్కడ చేశారు.. ఏ ప్రాంతంలో చేశారు? అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేవలం జగన్ ను, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల్లా అనిపిస్తున్నాయి కానీ.. ఇందులో నిజముందని నమ్మే పరిస్థితులు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పైగా.. ప్రస్తుతం ఈ మూడు రాజధానుల అంశం హైకోర్టు పరిధిలో ఉంది. ఏదైనా కీలక అంశం కోర్టు పరధిలో ఉన్నప్పుడు మీడియా ముందు.. ‘ఆ విషయం కోర్టు పరిధిలో ఉంది.. దాని గురించి ఇప్పుడే మాట్లాడకూడదు’ అని చెప్పే రాజకీయ నాయకులు ఈ విషయంలో మాత్రం ఆ మాట మర్చిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు, ఓ వర్గం మీడియా లెక్కలు, లాజిక్కులు లేకుండా కథనాలు ప్రసారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి.