‘అతడు’ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. కోర్టు కేసుల్లో సాక్ష్యాలు, ఆధారాలు నిరూపణై తీర్పులు వచ్చేసరికి నువ్వూ ఉండవు.. నేనూ ఉండను’ అని. భారత్ లో కోర్టు తీర్పులపై డైలాగ్ అది. ప్రజా ప్రతినిధులపై అనేక రకాల కేసులు ఉంటాయి. ఇవన్నీ జిల్లా కోర్టుల నుంచి సుప్రీంకోర్టల వరకూ వెళ్తాయి. ఇప్పుడీ అంశాన్ని ప్రముఖ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ కొత్త కోణంలోకి తీసుకెళ్లారు. దేశంలోని ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై అత్యున్నత ధర్మాసనం స్పందించడమే కాదు.. ఇందుకు సంబంధించి తదుపరి చర్యలకు ఉపక్రమించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ప్రజా ప్రతినిధుల్లో గుబులు..
ఉపాధ్యాయ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టులో విచారించింది జస్టిస్ ఎన్వీ రమణ. దేశంలోని అన్ని హైకోర్టులకు ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడెక్కడ ప్రజా ప్రతినిధులపై కేసులు ఉన్నాయో ఆ రిపోర్టు ఇవ్వాలంటూ ఆదేశించింది. దీంతో హైకోర్టుల్లో కదలిక వచ్చింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను బయటకు తీస్తున్నాయి. మరో రెండు మూడు వారాల్లో ఇందుకు సంబంధించిన విచారణ కూడా ప్రారంభం కానుంది. దీంతో ఏళ్లుగా కోర్టుల్లో మూలుగుతున్న తమ కేసులపై కాస్త నిర్భయంగా ఉన్న నేతల్లో ఒక్కసారిగా కలవరపాటు మొదలైంది. తమపై కేసులు ఏ మలుపు తీసుకుంటాయో.. తమపై ఎటువంటి తీర్పు వస్తుందోనని ఇప్పిటి నుంచే ఆందోళన చెందుతున్నారంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎంత స్పీడ్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
సీఎం జగన్ పై ప్రభావం చూపిస్తుందా..?
ఈ ఎఫెక్ట్ ఏపీ సీఎం జగన్ పై పడిందని చెప్పాలి. కారణం.. రాష్ట్ర హైకోర్టు తీర్పులపై ప్రభావం చూపిస్తున్నారంటూ జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం తెలిసిందే. దీనిని అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ తప్పుబట్టారు. జస్టిస్ రమణ ఈ ఉత్తర్వులు ఇచ్చాకే జగన్ న్యాయమూర్తులపై లేఖ రాసారంటూ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కు లేఖ రాసారు కూడా. కోర్టు ధిక్కారణ చర్యగా చూడాలని ఆ లేఖలో ప్రస్తావించారు కూడా. దీంతో సుప్రీంకోర్టు చేపట్టబోయే విచారణల్లో జగన్ పై ఉన్న కేసులు కూడా రానున్నాయి. దీంతో అశ్వినీ ఉపాధ్యాయ లాగిన తీగకు ప్రజా ప్రతినిధుల డొంకలు కదిలేలా ఉన్నాయి.