టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జవహర్ రెడ్డి నియమితులయ్యారు. సీఎం జగన్ తిరుమల ఎప్పుడు వెళ్తున్నా అన్నిరకాలుగా ప్రొటోకాల్ పాటిస్తున్నా.. ఈవో అనిల్ సింఘాల్ పై ఎందుకు వేటు పడింది? ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కీలకమైన విధుల్లో ఉన్న జవహర్ రెడ్డికి అకస్మాత్తుగా టీటీడీ ఈవోగా నియమించడం యాధృచ్చికమా.. వ్యూహాత్మకమా..?
అనిల్ సింఘాల్ చేసిన తప్పులేంటి..?
టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్ 2017లో బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం హయాంలో ఏడాదిన్నర, వైసీపీ హయాంలో ఏడాదిన్నరగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పదవిలో ఉండగా రెండు ప్రభుత్వాలకు అనుగుణంగా, చైర్మన్లకు అనుకూలంగా పని చేస్తూ తన పనితనం చూపించారు. వివాదాల జోలికి ఎప్పుడూ వెళ్లలేదు. అయితే.. ఒక్కోసారి అతి భజన చేసారని చెప్పాలి. ప్రధాని మోదీ, సీఎం జగన్, విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర తిరుమలకు వచ్చినప్పుడు అన్ని రకాల రాచమర్యాదలు చేశారు. అయినా.. అనిల్ బదిలీ అయ్యారు. జవహర్ రెడ్డికి ఎప్పటినుంచో టీటీడీ ఈవోగా పని చేయాలనే కోరిక మేరకే ఈ బదిలీ, నియామకాలు జరిగాయని తెలుస్తోంది. మరోవైపు.. ఇటివల టీటీడీలో పలు వివాదాలు, పాలకమండలి నిర్ణయాలు.. కారణంగా కూడా అనిల్ ను బదిలీ చేసారని తెలుస్తోంది.
ధర్మారెడ్డి ఉంటారా.. వెళ్తారా..?
టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి వెళ్తున్నారు. అయితే.. జేఈవోగా ఉన్న ధర్మారెడ్డి ఆ స్థానంలో ఉంటారా బదిలీ అవుతారా అనేది తెలియాల్సి ఉంది. ఈవో, జేఈవో, పాలకమండలి చైర్మన్, సభ్యులు.. ఇలా అందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారుంటే ప్రభుత్వానికి చిన్న అపవాదు తప్పదు. దీని నుంచి తప్పించుకునేందుకు ధర్మారెడ్డిని మార్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ధర్మారెడ్డి కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకంగా వ్యవహరించారు. పాలకమండలికి కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అయితే.. సామాజికవర్గాల సమీకరణలతో ధర్మారెడ్డిని బదిలీ చేసి సచివాలయంలో కీలక స్థానం అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.