ఖమ్మం, మార్చి 31: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న విషయం విదితమే. పొంగులేటి బిజెపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
రెండు రోజుల క్రితమే పొంగులేటి ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి అయ్యింది. యువజన కాంగ్రెస్ నాయకుడుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పొంగులేటి సుధాకరరెడ్డి మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు. ఎఐసిసి కార్యదర్శి స్థాయి వరకూ ఎదిగారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు.
ఆదివారం తన రాజీనామా లేఖను ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. రాహుల్ గాంధీకి పంపిన లేఖలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ల కేటాయింపు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో అభ్యర్థుల నుండి వసూలు చేశారంటూ ఆరోపణ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారయ్యిందని పేర్కొన్నారు.
సుధాకరరెడ్డి బిజెపిలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. బిజెపి సీనియర్ నాయకుడు రాంమాధవ్ చొరవతో ప్రధాని నరేంద్ర మోదిని కలిసి ఆయన సమక్షంలో బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తుంది.