2007.. తెలంగాణ ఉద్యమ సమయం. పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో ‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమా వచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు, డైలాగులు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని, కేసీఆర్ ను కించపరిచారనే ఆరోపణలతో వివాదం చెలరేగింది. సినిమా ప్రదర్శన ఆపేసి పోసానిని టార్గెట్ చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. పోసాని అప్పటికప్పుడు.. కేసీఆర్, టీఆర్ఎస్, తెలంగాణ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడారు ఇప్పుడిదంతా ఎందుకంటే.. మళ్లీ పోసాని సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ ను పొగిడేస్తున్నారు. కేసీఆర్ పొగిడే క్రమంలో ఆంధ్రా వాళ్లు వెళ్లిపోయాకే తెలంగాణ బాగుందని.. కేసీఆర్ హయాంలో హాయిగా ఉందనడం విమర్శలకు తావిస్తోంది.
ఏంటీ పోసాని.. మీకిది తగునా..?
గ్రేటర్ ఎన్నికల వేళ మాట్లాడుతూ.. కరెంట్ విషయంలో ఆంధ్రా వాళ్లు వెళ్లిపోయాకే ఇక్కడ పరిస్థితులు బాగున్నాయన్నారు. అప్పట్లో దేశమంతా కరెంట్ ఉండి ఏపీలో మాత్రమే లేదా.. అంటే దేశమంతా దాదాపు ఇదే పరిస్థితి. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏదో ఆవేశంలో మాట్లాడారు కానీ.. ఇప్పటికీ ఏ సెటిలర్ కు కూడా కేసీఆర్ హయాంలో అన్యాయం జరగలేదన్నారు. దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు భారతీయులకు ఉండనే ఉంది కదా..! వరదల సమయంలో కేసీఆర్ స్వయంగా వెళ్లి కాపాడలేరు కదా.. అనే మాటలు పోసానికి తగనివి. మరి.. గత ఏడాది ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలు పోసాని ఎలా మర్చిపోయారో..? ఆయనే చెప్పాలి. గ్రేటర్ లో కేసీఆర్ కే ఓటేయండి.. అని చెప్పడంలో తప్పు లేదు కానీ.. ఆంధ్రా వాళ్లు వెళ్లిపోయాకే తెలంగాణ, హైదరాబాద్ బాగున్నాయి అనడం.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోసానికి తగదనే చెప్పాలి.
వైఎస్ ను ఎందుకు మరచినట్టు..?
ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ హయాంలోనే శాంతిభద్రతలు బాగున్నాయని.. దిశ విషయంలో కేసీఆర్ కఠిన చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ క్రమంలో వైఎస్ హయాంలో వరంగల్ లో ఇంజనీరింగ్ చవివే యువతిపై జరిగిన దాడిలో వైఎస్ చాలా వేగంగా స్పందించిన విషయాన్ని ఎందుకు మరిచారో పోసానికే తెలియాలి. ఎన్టీఆర్ తర్వాత జనార్ధన్ రెడ్డి, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్.. ఇలా చాలామంది హవా నడిచింది. అయితే.. కేవలం ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ అనడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు అంటే పడదు కాబట్టి ఓకే. మరి.. ఏపీ సీఎం జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాం కూడా హైదరాబాద్ బాగాలేనట్టేనా..? కొన్నాళ్లు చిరంజీవి, మరికొన్నాళ్లు జగన్, ఇప్పుడు కేసీఆర్.. పై పోసాని లైనప్ బాగుందనే సైటైర్లు బాగానే పేలుతున్నాయి.