హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్లో వైసిపి ఘన విజయం సాధించడంతో సినీనటుడు పోసాని కృష్ణమురళి అమీర్పేట, బేగంపేట, ఫిలింనగర్ ఆలయాల్లో స్వామివార్లకు వస్త్రాలు సమర్పించి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి సీఎం కావాలని తాను దేవుళ్లకు మొక్కుకున్నాననీ, వైసిపి ఘన విజయం సాధించడంతో మొక్కుబడులు చెల్లించుకున్నానని తెలిపారు. గతంలో ఇక్కడ కెసిఆర్ సిఎం కావాలని దేవుడిని కోరి మొక్కులు తీర్చుకున్నానని పోసాని చెప్పారు.
జగన్ ముఖ్యమంత్రి కావాలన్నది తన చివరి కోరిక అనీ, అది నెరవేరినందుకు ఎంతో సంతోషిస్తున్నానని పోసాని అన్నారు. జగన్పై తప్పుడు కేసులు బనాయించేలా చేసిన చంద్రబాబు వాటిని ఉపసంహరించుకోవాలని పోసాని సూచించారు.
చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, మోసాలు మానేస్తే ఆయనకు పాదాభివందనం చేస్తానని పోసాని పేర్కొన్నారు.
జగన్ జనరంజక పాలన అందించి మంచి పేరు తెచ్చుకొని మళ్లీమళ్లీ ముఖ్యమంత్రి కావాలని పోసాని ఆకాంక్షించారు.
జగన్ మంచి వ్యక్తి కాబట్టే నిస్వార్థంగా మద్దతు తెలియజేశాననీ, ఆయన కంటే సమర్థుడు మరొకరు వస్తే వారికీ మద్దతు ఇస్తానని పోసాని అన్నారు.
గతంలో చంద్రబాబుకు మద్దతు ఇచ్చాననీ, ఆయన తప్పుడు పాలన నచ్చకే విమర్శలు చేశానని పోసాని తెలిపారు.
చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వల్లనే పవన్ కళ్యాణ్కు ఓటమి ఎదురయ్యిందని పోసాని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ మొదటి నుండి ఒంటరిగా ఉంటే ప్రజల మద్దతు వచ్చేదనీ, రాజకీయాల్లో నిజాయితీగా ఉండడం ముఖ్యమనీ పోసాని స్పష్టం చేశారు.