అమరావతి: ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకుడు టిడిపికి షాక్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు టిడిపికి షాక్ ఇచ్చి బిజెపిలో చేరారు. గుంటూరు నగర టిడిపి అధ్యక్షుడు చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్నది. ఎన్నికల ఫలితాల అనంతరం నలుగురు రాజ్యసభ సభ్యులతో ప్రారంభమైన వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు, తన కుమారుడు భరత్తో కలిసి ఢిల్లీ వెళ్లి మంగళవారం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు.
గుంటూరు నగర టిడిపి అధ్యక్షుడు చందు సాంబశివరావు పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 14న బిజెపి తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
నాసా, ఇస్రోలలో శాస్త్రవేత్తగా పని చేసి, ఆమెరికాలో వివిధ అంతర్జాతీయ సంస్థల్లో ఐటి విభాగంలో విశేష సేవలు అందించిన చందు సాంబశివరావు 2004లో చంద్రబాబు పిలుపు మేరకు టిడిపి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పలువురు నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా బిజెపి రాష్ట్రంలో వైసిపికి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు గేట్లు తెరిచింది.