(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కరోనాతో పాటు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గత కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించింది. కొద్ది సేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
భారత రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ప్రణబ్ ముఖర్జీ ఒకరు. 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీని సన్నిహితులు ప్రణబ్ దా అని అప్యాయంగా పలకరిస్తుండే వారు. దాదాపు 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రణబ్ ముఖర్జీ అనేక ఉన్నత పదవులు నిర్వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరొందారు.
ప్రణబ్ ముఖర్జీ రాజకీయాల్లోకి రాకముందు ఎజి కార్యాలయంలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత 1963లో విద్యానగర్ కళాశాలలో అధ్యాపకుడుగా పని చేశారు. బెంగాలీ పత్రిక దెషర్ దక్ లో పాత్రికేయుడుగానూ పని చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైయ్యారు. ఇందిరా గాంధీకి అత్యంత నమ్మకస్తుడుగా ఉండటంతో 1973లో మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 1982లో దేశ ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టారు.
ఇందిరా గాంధీ రాజకీయ వారసుడుగా రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారు. రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ స్థాపించిన ప్రణబ్ ముఖర్జీ 1989లో దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. పివి నర్శింహరావు హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా, తరువాత కీలకమైన విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
2012 నుండి 2017వరకూ ప్రణబ్ దేశ 13వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన భారతరత్న, పద్మవిభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు పొందారు.