Prasanth Kishore: ప్రశాంత్ కిశోర్ Prasanth Kishore త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం ఓ రేంజ్ లో నడుస్తోంది. మోదీ, షా – మమతా బెనర్జీ మధ్య మీరా.. నేనా అన్నట్టు ఈ యుద్ధం జరుగుతోంది. వాగ్భాణాలు, విమర్శలు, ఎత్తుకుపై ఎత్తులతో రసవత్తరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ భారీ కుదుపు. ‘సీఎం మమతా బెనర్జీ కాలికి గాయం’..! ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిపోయింది. అయితే.. ఈ ప్రమాదానికి నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటనకు ముడి పెడుతూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
2018లో జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడి ఓ సంచలనం. ఓ వ్యక్తి ఆయన భుజంపై గాయం చేయడం సంచలనమైంది. అప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందే ఆ ఘటన జరిగితే.. సరిగ్గా ఎన్నికల ముందు సీఎం మమతా బెనర్జీపై దాదాపు అటువంటి సంఘటనే జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న దీదీ కాలికి కారు డోరు తగిలి గాయమైంది. జగన్ పై ఒక వ్యక్తి దాడి చేస్తే.. దీదీకి జరిగింది ప్రమాదం అని పోలీసులు అంటున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధం లేదు. కానీ.. రెండు రాష్ట్రాల్లోని రెండు పార్టీలకు ఆయా సమయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నది ప్రశాంత్ కిశోర్.
దీంతో సోషల్ మీడియా వేదికగా అనుమానాలు వ్యక్తం చేస్తూ సెటైర్లు, మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ అంశం బాగా ట్రోల్ అవుతోంది. విశాఖ ఘటన తర్వాత జగన్ ఏపీ సీఎం అయ్యారు కాబట్టి.. మమతా బెనర్జీ కూడా సీఎం కావడం తథ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నారు పీకే. వ్యూహాలు వేయడంలో ఆయన దిట్ట అని పేరు. 2014లో కేంద్రంలో బీజేపీ, 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో పీకే వ్యూహాలే కారణమని పేరుంది. నాటి, నేటి ఘటనలకు ఎటువంటి సంబంధం లేకపోయినా.. అక్కడా.. ఇక్కడా ఉన్నది ప్రశాంత్ కిశోర్ కాబట్టి నెటిజన్లకు పని దొరికింది. ఏమైనా.. లోగుట్టు పెరుమాళ్లకెరుక..!