West Bengal : బెంగాల్ లో ఎన్నికలు ప్రస్తుతం దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒక పెద్ద యుద్ధాన్నే తలపించేలా ఉన్నాయి. దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఓవైపు.. రాష్ట్రాన్ని ఏలుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఓవైపు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ద్వయంతో ఒక మహిళా ముఖ్యమంత్రి ఢీ అంటే ఢీ అంటున్నారు. నిజానికి గత ఐదేళ్లు నుంచి కూడా ఇదే జరుగుతోంది. దేశ ప్రధానిని ఆస్థాయిలో ఢీ కొట్టడం మమతా బెనర్జీకి తప్ప మరెవరికీ సాధ్యం కాలేదేమో. ఇన్నాళ్లూ ఒకెత్తు.. ఇప్పటి అసెంబ్లీ ఎన్నికలు ఒకెత్తు. ఈ పరిక్షలో నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని మమత.. ఆమెకు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. వీరిద్దరి పోరు మధ్య మమతకు ఎన్నికల వ్యూహకర్తగా వర్క్ చేస్తున్న ప్రశాంత్ కిశోర్ ట్వీట్ కూడా ఆసక్తి రేపుతోంది.
One of the key battles FOR DEMOCRACY in India will be fought in West Bengal, and the people of Bengal are ready with their MESSAGE and determined to show the RIGHT CARD – #BanglaNijerMeyekeiChay
(Bengal Only Wants its Own Daughter)
PS: On 2nd May, hold me to my last tweet. pic.twitter.com/vruk6jVP0X
— Prashant Kishor (@PrashantKishor) February 27, 2021
మోదీ, షా వర్సెస్ మమత
సీఈసీ ప్రకటించిన ఐదు రాష్ట్రాల ఎన్నిక్లో బెంగాల్ పైనే ప్రధానంగా దృష్టి సారిస్తోంది బీజేపీ. కారణం సీఎం మమతా బెనర్జీ వర్సెస్ మోదీ అండ్ అమిత్ షా లా మారిన పరిస్థితులే. నోట్ల రద్దు సమయంలో మోదీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పెద్ద రచ్చే చేశారు. 2019లో బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మమత భారీ నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలకు బొగ్గు మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న మోదీ వ్యాఖ్యలకు.. ‘నిరూపిస్తే తమ 42 మంది ఎంపీ అభ్యర్థులను బరి నుంచి తప్పిస్తామన్నారు. రుజువు చేయకపోతే మోదీ చెవులు పట్టుకుని వంద గుంజీళ్లు తియ్యాలని ఛాలెంజ్ విసిరారు. ఓ ప్రచార సభలో మోదీని చెంప దెబ్బ కొట్టాలన్నంత కోపం వచ్చిందని చేయి పైకెత్తి చూపించారు. ఇందుకు మోదీ.. ‘దీదీ నన్ను చెంపదెబ్బ కొట్లాలనుకుంటోంది. దీదీ.. నేను మిమ్మల్ని నా సోదరిగా భావిస్తున్నా’ అన్నారు. అమిత్ షాకు ధైర్యం ఉంటే నన్ను ఢీ కొట్టాలంటే ముందు నా మేనల్లుడి గెలవాలని సవాల్ చేశారు.
పరిస్థితులకు వెరవని దీదీ
కేంద్రంతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో ఢీకొట్టడం సామాన్యమైన విషయం కాదు. బెంగాల్లో పాగా వేయాలనుకున్న బీజేపీ అక్కడ తన అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పలువురు నేతలను బీజేపీలోకి వచ్చేలా చేసింది. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దినేష్ త్రివేదీ, క్రీడల శాఖ సహాయ మంత్రి లక్ష్మణ్ రతన్ శుక్లా, పార్టీ ముఖ్య నేత సువేందు అధికారి, అటవీ శాఖ మంత్రి రాజీబ్ బెనర్జీ, బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్, పార్టీ నేత అరిందమ్ భట్టాచార్య.. ఇలా కీలక నేతలు అధికారంలో ఉండి కూడా తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇవన్నీ మమతకు షాక్ ఇచ్చాయి. అయినా.. మమతా బెనర్జీ ఎక్కడా తడబడటం లేదు. ఇవన్నీ బీజేపీ ఒక మహిళ మీద చేస్తున్న కుట్రలుగా అభివర్ణించారు. ఇటివల బెంగాల్ లో పర్యటించిన బీజేపీ నేతలపై జరగిన దాడులపై కలకలం రేపింది. దీనిని బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఇలా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు ఇప్పుడు పతాకస్థాయికి చేరుకుంది.
ప్రశాంత్ కిశోర్ మళ్లీ నిరూపిస్తారా..
ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటంలో ముఖ్యమైన ఘట్టం బెంగాల్లో జరగబోతోంది. బెంగాల్ ప్రజలు సరైన వ్యక్తిని ఎంచుకుని దేశానికి మంచి సందేశం ఇవ్వబోతున్నారు. మే 2న నేను చేసిన ఈ ట్వీట్ నిజం కాబోతోంది.. గుర్తు పెట్టుకోండి’ అని ట్వీట్ చేశారు. దీంతో బెంగాల్లో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగిపోయింది. బెంగాల్లో బీజేపీకి అనుకూల మీడియా తప్ప గొప్పలు చెప్పేందుకు ఏమీ లేదు.. అని గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ప్రశాంత్ కిశోర్ అంచనా తప్పింది లేదు. 2019లో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడంలో కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఫలించాయి. దీంతో బెంగాల్లో దీదీకే మళ్లీ అధికారం దక్కుతుందనే విశ్లేషణలు జరుగుతున్నాయి. మరోవైపు బీజేపీ కూడా తన మార్క్ రాజకీయాలు రెడీ చేసుకుంటోంది. అమిత్ షా విరివిగా పర్యటిస్తున్నారు. ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగడం ద్వారా బెంగాల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. మరి.. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.