రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అనే సామెతను నిజం చేసేలా ఏపీ ప్రభుత్వం సంచలనం రేపే నిర్ణయం తీసుకుంది. ఇటివలే తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యి.. ఏపీ క్యాడర్ కు వచ్చిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి వచ్చిన నెల రోజుల్లోనే ప్రమోషన్ లభించింది. కార్యదర్శి నుంచి ముఖ్య కార్యదర్శి హోదాకు ప్రభుత్వం ప్రమోట్ చేసింది. ఈమేరకు సీఎం ఆదిత్యనాధ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఆమెపై కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల తుది తీర్పులు, డీవోపీటీ నిర్ణయంపై ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఇంత ఆఘమేఘాల మీద ఆమెకు పదోన్నతి కల్పించడం వెనుక ఆమెపై ఉన్న సానుభూతే కారణమనే వాదన కూడా ఉంది. వైఎస్ హయాంలో జరిగాయనే ఆరోపణలు ఉన్న క్విడ్ ప్రో కేసులో శ్రీలక్ష్మి కూడా జైలుకు వెళ్లారు.
జగన్ సీఎం కావడం ఆమెకు లక్..
వైఎస్ మరణం తర్వాత ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కేసుల్లో జైలుకు వెళ్లిన సంగతి తెలసిందే. అనంతర కాలంలో రాష్ట్ర విభజన సమయంలో ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె స్వస్థలం విశాఖపట్నం అయినా.. పోస్టల్ అడ్రస్ హైదరాబాద్ లో ఉండటంతో తెలంగాణకు కేటాయించారు. అయితే.. రాష్ట్రం విడిపోయాక ఏపీకి రావాలని భావించినా అప్పటి సీఎం చంద్రబాబు కావడంతో ఆమె ఏపీకి రాలేకపోయారు. 2019లో ఏపీలో జగన్ సీఎం అయ్యాక ఆమె ఏపీకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నం చేశారు. రీసెంట్ గా వచ్చిన ఆమెకు ఏపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖ కార్యదర్శిగా నియమించింది. ఇప్పుడు ఏకంగా నెల రోజుల్లోనే ప్రమోషన్ ఇచ్చింది. ఆమెపై ఉన్న నమ్మకం, గతంలో జరిగిన పరిణామాల నేపథ్యం జగన్ కు తెలిసిందే కావడంతో ఆమెకు ప్రమోషన్ లభించింది.
ఆమె.. ఐఏఎస్ టాప్ ర్యాంకర్..
వైఎస్ హయాంలో గాలి జనార్ధన్ రెడ్డికి సబంధించి ఓబుళాపురం మైనింగ్ స్కామ్ లో 2011 నవంబర్ 28న ఆమె అరెస్టయ్యారు. చంచల్ గూడ జైలులో ఉన్నారు. 2012లో ఆమె బెయిల్ పై విడుదలయ్యారు. మొత్తానికి ఆమెపై ఉన్న కేసులు వీడటంతో అయిదేళ్ల తర్వాత 2016లో కేంద్రం ఆమెకు తెలంగాణ క్యాడర్ ను కేటాయించింది. మళ్లీ దాదాపు ఐదేళ్లకు 2020 చివర్లో ఆమె సొంత రాష్ట్రం ఏపీకి వచ్చారు. గత ఏడాదే ఆమె సీఎం జగన్ కు కలుసుకున్నారు. అయితే.. కేంద్రం ఆమెను ఏపీకి కేటాయించడానికి నిరాకరించడంతో క్యాట్ ను ఆశ్రయించారు. తండ్రి రైల్వే ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ లో ఉండాల్సి రావడం.. అందుకే అడ్రస్ తెలంగాణలో ఉందని నిరూపించడంతో ఆమె ఏపికి వచ్చేందుకు క్యాట్ ఆదేశాలిచ్చింది. 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి ఐఏఎస్ ఉత్తీర్ణతలో టాప్ ర్యాంకర్.