కడప: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రమేయముంటే ఉరితియ్యమని పులివెందుల టిడిపి అభ్యర్థి సతీష్ రెడ్డి అన్నారు. వివేకా హత్య ఘటనపై ఆయన కుమార్తె సునీతారెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం సతీష్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
వివేకా కూతురు సునీత మాటలు వింటుంటే చాలా బాధ కలిగిందనీ, తన తండ్రి హత్య విషయంలో సునీత చెప్పిన విషయాలన్నీ సరైనవేనని సతీష్ రెడ్డి అన్నారు. వివేకా హత్యను ఎందుకు రాజకీయం చేస్తున్నారని వాళ్ళను సునీత అడగాలని సతీష్ రెడ్డి సూచించారు.
కేసు విచారణపై ఎలాంటి ప్రభావం ఉండకూడదని సునీత కూడా చెబుతున్నారు. విచారణ జరుగుతుంది కాబట్టి దయచేసి సంయమనం పాటించాలని సతీష్ రెడ్డి కోరారు. చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదు. అందుకే ఆయన చనిపోయిన రోజు నుంచి మేం ఒక్క వ్యాఖ్య కూడా వ్యతిరేకంగా చేయలేదని సతీష్ రెడ్డి అన్నారు.
ఈ ప్రాంత నాయకుడు చనిపోయాడన్న గౌరవంతో నాడు వెంటనే ప్రచారం కూడా నిలిపివేశామని సతీష్ రెడ్డి చెప్పారు.
ముందు గుండెపోటు అని ప్రచారం చేశారు. తర్వాత హత్య అని తేలింది. ఉన్నట్టుండి వైసిపి నేతలు తమ పార్టీ నేతలపై రాజకీయంగా అసత్య ఆరోపణలు చేశారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
‘ప్రతి సందర్భంలో వైసిపి నాయకులు టిడిపి నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. మా ఇళ్లపై దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేశారు. మా కార్యాలయం ధ్వంసం చేశారు. దాడులు మాపైనే..ఆరోపణలు మాపైనే. క్షోభ అనుభవిస్తున్నాం’ అని సతీష్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
పులివెందులలో జరిగిన అన్ని ఘటనలపై చర్చ జరిపేందుకు తాను సిద్ధమని సతీష్ రెడ్డి సవాలు విసిరారు. రాజకీయ విద్వేషాలు, కక్ష సాధింపులు మానుకోవాలని సతీష్ రెడ్డి హితవు పలికారు.