వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ప్రస్థానంలో ప్రస్తుతం రోజుకో రకమైన హాట్ టాపిక్ ఏపీ రాజకీయాలలో వస్తుంది. ఎంపీ గా గెలవాలని రాజకీయ రంగంలో అడుగుపెట్టిన రఘురామకృష్ణంరాజు అనేక పార్టీలు మారడం జరిగింది. అదృష్టం కలిసివచ్చి 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు టిడిపి నుండి వైసీపీలో చేరిన నరసాపురం ఎంపీగా బరిలో దిగి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత అనేక మీడియా ఇంటర్వ్యూలలో, ఇది తన విజయం కాదని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కష్టంమీద గెలిచినట్లు ఓపెన్ గానే చెప్పుకొచ్చారు.
కానీ మధ్యలో ఏమైందో ఏమో తెలియదు గానీ… ఒక్కసారిగా సొంత పార్టీ అధినేత జగన్ కి వ్యతిరేకంగా మీడియా ముందు వ్యవహరిస్తూ, పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో పార్టీ హైకమాండ్ నుండి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు. అప్పటి నుండి తన పలుకుబడి ఉపయోగించుకుంటూ ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులతో, రాష్ట్రపతితో కూడా భేటీ అవుతూ చీటికి మాటికి వైసీపీ పార్టీ పై ఫిర్యాదు చేస్తూ రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా న్యాయవాదుల “ఫోన్ ట్యాపింగ్” విషయంలో షాకింగ్ కామెంట్లు చేసిన రఘురామకృష్ణంరాజు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లెటర్ రాశారు.
ఏపీ ప్రభుత్వం గత కొన్ని రోజుల నుండి తాను వాడుతున్న ఫోన్ నెంబర్లను ట్యాప్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. దీంతో ప్రతి అంశానికి హడావిడి చేస్తూ రఘురామకృష్ణంరాజు వ్యవహరించడంతో ఈయన చేస్తున్న ఫిర్యాదుల తో ఢిల్లీ పెద్దలకు తలనొప్పిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రతిసారి సందర్భం ఉన్నా, లేకున్నా సొంత పార్టీపై ఈ విధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరించడం పట్ల ఢిల్లీలో ఉన్న పెద్దపెద్ద నాయకులు అసహనం చెందుతున్నట్లు జాతీయ స్థాయిలో టాక్ వినపడుతోంది. చేసే ఫిర్యాదులో పస లేకపోవడంతో, మరోవైపు తమ సమయాన్ని వేస్ట్ చేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు పై ఢిల్లీ పెద్దలు అసహనం చెందుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.