RRR: ‘కందకు లేని దురద.. కత్తిపీటకు ఎందుకు’ అని ఓ సామెత. కానీ.. ఇక్కడ కత్తిపీట పదును మరింత పదునెక్కుతోంది. విషయంలోకి వస్తే.. వైసీపీ రెబల్ రఘురామకృష్ణ రాజు తన ఎంపీ పదవికి రాజీనామా (క్లారిటీ లేదు) చేస్తానని ప్రకటించారు. అది కూడా.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా.. అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలనే అంశానికి మద్దతుగా. దాదాపు రెండేళ్లుగా రఘురామ సొంత పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. పార్టీ షోకాజ్ నోటీస్, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ పార్లమెంట్ స్పీకర్ కు లేఖ ఇచ్చినా, ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ ఆయన్నేమీ చేయలేకపోయింది. కానీ.. ఆయనే స్వయంగా రాజీనామా చేస్తానని ప్రకటించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
చంద్రబాబు చేసింది ఇంతేనా..
మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి, ప్రస్తుతం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అమరావతే రాజధానిగా ఉంచాలని టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు వాదిస్తున్నాయి. అమరావతి ప్రాంత రైతులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. అయితే.. అమరావతి కోసం (RRR) రఘురామ రాజధాని చేస్తానని.. అదే నినాదంతో ఉప ఎన్నికకు వెళ్తానని అన్నారు. ఇది చాలా తెగువతో కూడుకున్న నిర్ణయమే. కానీ.. ఇదే తెగువ తన హయాంలో రాజధానిగా ప్రకటించి, భూసేకరణ చేసి మొదలుపెట్టిన చంద్రబాబు మాత్రం వైసిపీకి సవాల్ విసరడమే తప్ప చేసిందేమీ లేదని చెప్పాలి. అమరావతి రిఫరండమ్ గా ఎన్నికలకు వెళ్దాం.. రాజీనామాలు చేయండి అని జగన్ కు సవాల్ విసురుతున్నారు.
చంద్రబాబు సమాధానం ఏంటి..
టీడీపీ ఎమ్మెల్యేలే రాజీనామా చేస్తే ఎన్నికలకు వెళ్దాం.. తేల్చుకుందామని వైసీపీ ప్రతి సవాల్ విసిరితే సమాధానం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి, వీళ్లంతా గెలుస్తారో లేదో.. ఎందుకొచ్చిందిలే అని చంద్రబాబు వెనకడుగు వేసుండొచ్చు. కానీ.. (RRR) రఘురామ తెగువ చూస్తే.. అసలు రాజీనామా చేసి అమరావతి కోసం పోరాడాల్సింది ఎవరు.. పోరాడుతోంది ఎవరనే అనుమానం రాకపోదు. రాజధాని అంశంతో సంబంధం లేని రఘురామ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే.. మరి చంద్రబాబును చూసి ప్రజలు ఏమనుకోవాలి. అమరావతిపై రఘురామ తెగువను చూసి టీడీపీ విశ్వసనీయతపై ప్రశ్నలు వేస్తే చంద్రబాబే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందేమో..!