వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సొంత పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. ఢిల్లీలో రఘురామకృష్ణ రాజు రచ్చబండ అనే వేదికతో రోజూ ఏదొక అంశంతో మీడియా ముందుకు వస్తున్నారు. సొంత ప్రభుత్వం అంటూనే జగన్ ను, వైసీపీని జాతీయ మీడియా సాక్షిగా ఇరుకున పెడుతున్నారు. కొన్ని సున్నితమైన, కీలకమైన అంశాలను కూడా జాతీయస్థాయిలో లేవనెత్తుతూ ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారు. ఏకంగా ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందంటూ ప్రధానికి, బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో జగన్ కు ఆయన పెద్ద ట్రబుల్ గా మారారు.
కేంద్రం వద్ద కీలకమైన ఫిర్యాదు.. కదిలినట్టే ఉంది..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇళ్లు ఇవ్వాలని సీఎం జగన్ ఎంత సీరియస్ గా ఉన్నారో తెలిసిందే. అయితే.. అనేకచోట్ల భూవివాదాలు, ఆక్రమణలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ ముందుకు వెళ్లడం లేదు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఆవ భూముల విషయంలో భారీ అవినీతి జరగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపించడం, హైకోర్టులో కేసు నమోదవడం.. స్టే ఇవ్వడం కూడా జరిగింది. అయితే.. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందని కేంద్రమే కల్పించుకుని విచారణ చేయాలని ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రధానికి లేఖ రాశారు. తగిన ఆధారాలతో ఫొటోలు కూడా పంపించారు. దీనిపై పీఎంఓ స్పందించింది. ఏపీ సీఎస్ కు ఆ లేఖను జత చేసి తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది.
ఏసీబీకి దొరికేలా ఆధారాలు ఇస్తా..
కేంద్రానికి ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. దానిని రాష్ట్రానికి పంపించి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర పెద్దలు ఆదేశించడం సాధారణమే. ఇప్పుడూ అదే జరిగింది. ఏసీబీ అధికారులు ఈ లేఖపై స్పందిస్తూ.. ఇక్కడ అవినీతి ఆరోపణల్లో ప్రజాప్రతినిధులు ఉంటే చర్యలు తీసుకోలేమని.. వారిపై ఎటువంటి దాడులు, కేసులు నమోదు చేయలేమన్నారు. ఇందుకు రఘురామకృష్ణ రాజు ప్రతిస్పందిస్తూ.. ఈ అవినీతిలో అధికారులు కూడా ఉన్నారని, అధికారుల సాయం లేకుండా రాజకీయ అవినీతి జరగదని పేర్కొంటూ మరో లేఖ రాశారు. కాబట్టి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటే అవినీతిపరులు బయటకొచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలా ఇళ్ల పట్టాల అంశాన్ని జాతీయస్థాయిలో ప్రస్తావించి ఏకంగా సీఎం జగన్ నే టార్గెట్ చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?