Raghurama Krishnam raju: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ మాత్రం పట్టించుకోకుండా వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ యడాపెడా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వేల కోట్ల రూపాయలు లబ్దిదారులకు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్న హామీలను అమలు చేస్తున్నది జగన్ సర్కార్. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలునకు ఎడా పెడా అప్పులు తీసుకురావడం జరిగింది. దీంతో కొత్తగా అప్పులు దొరికే పరస్థితి లేదు.నెలనెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అప్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కార్పోరేషన్ సంస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర అభివృద్ధి కార్పోరేషన్ పేరిట ప్రత్యేకంగా ఓ సంస్థను ఏర్పాటు చేసింది.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే…ఆ కార్పోరేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడమే కాక భవిష్యత్తులో మద్యం అమ్మకాలు ద్వారా వచ్చే ఆదాయాన్ని సైతం గ్యారెంటీగా చూపి అప్పులు తీసుకుంటున్నది ఏపి ప్రభుత్వం. దీనిపై వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. రాజ్యాంగ విరుద్దంగా ఏపి ప్రభుత్వం అప్పులు చేస్తోందని, దీనిపై విచారణ జరిపించాలని లేఖలో కోరారు. తొలుత రఘురామ లేఖను లైట్ గా తీసుకున్న కేంద్రం తరువాత దీనిపై రియాక్ట్ అయ్యింది. ఏపి ప్రభుత్వం రాసిన లేఖను కేంద్ర ఆర్థిక శాఖలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి చదివి, భవిష్యత్తు ఆదాయం చూపి రుణం తీసుకుంటున్న విషయాన్ని గమనించి అవాక్కు అయ్యారట. వెంటనే ఈ లేఖలలోని సమాచారాన్ని ఆర్ధిక శాఖ మంత్రికి వివరించడంతో కదలిక మొదలైంది. రఘురామ లేఖపై ఏపి ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.
ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అప్పు తీసుకోవడం తప్పులేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. మద్యం అమ్మకాలు ద్వారా భవిష్యత్తులో వచ్చే అదాయాన్ని గ్యారెంటీగా చూపి రుణం తీసుకోవడం. దీన్ని కేంద్ర ఆర్ధిక శాఖ పూర్తిగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏయే రూపంలో ఎక్కడెక్కడ ఎంత రుణం తీసుకున్నారు. వాటికి గ్యారెంటీగా ఏమి చూపారు తదితర విషయాలను కేంద్రానికి పంపాలంటూ నోటీసులో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి కూడా ఏపి అప్పులు చేసిన వైనంపై కేంద్రం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ నోటీసుతో ఏపి ప్రభుత్వం ఢిఫెన్స్ లో పడింది. దీన్ని ఎలా సమర్ధించుకోవాలో తెలియక కొంత ఇబ్బందుల్లో పడింది.