వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావడానికి ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఓ వర్గం మీడియా ఛానల్స్ కి వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ తాజాగా జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో కృష్ణాష్టమి రోజు రామ భజన అన్నట్టుగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహరించారు. పూర్తి విషయంలోకి వెళితే బిజెపి పార్టీ కీలక నాయకుడు రామ్ మాధవ్ ఏపీ 3 రాజధానులు విషయం గురించి ఇటీవల కామెంట్లు చేయడం జరిగింది.
దేశంలోనే 80 ఎంపీలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కి ఒకే ఒక రాజధాని ఉన్నప్పుడు ఏపీ కి 3 రాజధానులు ఎందుకు అని ప్రస్తావించారు. ఇప్పుడు బిజెపి నాయకుడు రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆధారం చేసుకుని బిజెపి పార్టీకి భజన చేస్తున్నట్టుగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. దేశంలోనే ఆయన సీనియర్ నేత, అలాంటి నాయకుడు చేసిన వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకుని మూడు ప్రాంత ప్రజలను మోసం చేయకూడదు అని ఈ వైసీపీ తిరుగుబాటు ఎంపీ అన్నారు.