ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో రాజధాని తరలింపు అంశం ఒకటి. దీనిపై ఆయన రాజకీయ పార్టీలు, కోర్టులు, రైతుల నుంచి ఏడాదిగా ముప్పేట దాడిని ఎదుర్కొంటునే ఉన్నారు. అయినా.. జగన్ ముందుకే వెళ్తున్నారు. సహజంగానే ఈ అంశం హైకోర్టులో విచారణ దశలో ఉంది. రాజధాని తరలింపు అంశాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి విచారిస్తున్నారు. ఓపక్క హైకోర్టు తీర్పులు ప్రభావితం అవుతున్నాయంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు బహిరంగ లేఖ రాశారు జగన్. ఈ పిల్ కీలకదశలో ఉండగా హైకోర్టు చీఫ్ జస్టిస్ కు సిక్కిం హైకోర్టుకు బదిలీ అయింది. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ స్పందించిన తీరు ఇప్పు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
రాష్ట్రపతికి లేఖ..
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీని నిలుపుదల చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏకంగా రాష్ట్రపతికి ఓ లేఖ రాశారు. ఏపీ రాజధాని తరలింపు అంశం హైకోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ బదిలీ సరికాదని.. పునఃసమీక్షించి ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలంటూ లేఖలో కోరారు. నిజానికి.. రఘురామకృష్ణ రాజు రాసిన లేఖ సబబే అని చెప్పాలి. ఈ అంశంపై జస్టిస్ మహేశ్వరి మొదటి నుంచీ ఫాలో అవుతూ అందరి వాదనలు కూలంకషంగా విని ఉన్నారు. దీనిపై వాదనలు విన్న ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా ప్రజలకు మేలు చేసేదే అవుతుంది. ప్రజలు కూడా రాజధాని అంశం త్వరగా తేలాలని కోరుకుంటున్నారు. ఈ సమయంలో వచ్చే కొత్త చీఫ్ జస్టిస్ ఈ అంశాన్ని మొదటి నుంచీ అధ్యయనం చేయాల్సిందే.
ప్రజల కోసమేనా.. లేక..!?
మళ్లీ.. రైతులు, ప్రతిపక్షాలు, ప్రభుత్వ వాదనలు వినాలి. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచీ ఉన్న జస్టిస్ మహేశ్వరి అయితేనే ఈ కేసు త్వరితగతిన తేలుతుందని ఎంపీ రఘురామకృష్ణ రాజు అభిప్రాయంగా చెప్పాలి. అయితే.. హైకోర్టు తీర్పులపై నమ్మకంగా లేని ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బదిలీ ముఖ్యం. ఓపక్క సొంత పార్టీతో పొసగని ఎంపీ రఘురామకృష్ణ రాజు రాసిన లేఖ వెనుక ‘రాజకీయ ప్రోత్బలం’ ఉందా అనే అనుమానాలూ లేకపోలేదు. ఇవన్నీ పక్కనపెడితే.. ప్రజల దృష్ట్యా ఈ అంశంపై త్వరగా ఓ శాస్వత పరిష్కారం లభిస్తే అందరికీ మంచిది. మరి రాష్ట్రపతి దీనిపై స్పందిస్తారో లేదో చూడాలి.