Rahul Gandhi : రాహుల్ గాంధీ Rahul Gandhi ఇటివల ఏపీ, తెలంగాణలో జరిగిన రెండు సంచలనాలకు అనంతపురం రాజకీయాలను.. ముఖ్యంగా తాడిపత్రి రాజకీయాల్ని శాసించే జేసీ బ్రదర్స్ కు లింక్ ఉంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపి తాడిపత్రి మున్సిపాలిటీని చేజిక్కించుకున్నారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రాష్ట్రం మొత్తం వైసీపీ ప్రభంజనం చూపిస్తే.. అనంతపురంలో జేసీ బ్రదర్స్ పట్టు నిలుపుకున్నారు. ఇక జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్ వెళ్లి ఏకంగా గాంధీ భవన్ లో కూర్చుని అక్కడి కాంగ్రెస్ నేతలకే క్లాస్ తీసుకున్నారు. పైగా.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు కూడా చేశారు. అన్నదమ్ములిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు అంశాల్లో సంచలనం రేపారు.
ఇదంతా తెలిసిందే అయినా.. ఈ అంశాలపై జేసీ బ్రదర్స్ కు రాహుల్ గాంధీ ఫోన్ చేశారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ పాలిటిక్స్ లో తమ పట్టు నిలుపుకోవడం, హైదరాబాద్ జేసీ వ్యాఖ్యలపై రాహుల్ ఫోన్ చేశారని తాడిపత్రి రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇంతటి ఫ్యాన్ గాలిలో కూడా జేసీ తట్టుకోవడం ఢిల్లీ వరకూ ఈ వార్త చేరిందని.. జాతీయ చానెల్స్ ఈ విషయం చూపారని అంటున్నారు. రాహుల్ ఫోన్ చేసి జేసీ బ్రదర్స్ ను అభినందించినట్టు తెలుస్తోంది. ఏపీ రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పూర్తి అధికారిక వార్త లేకపోయినా జేసీ సర్కిల్స్ లో తాడిపత్రిలో కూడా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు.
తెలంగాణ ఇచ్చిన వెంటనే ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోగా.. తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో జేసీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఏపీలో కూడా వీరు ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమీ బాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పునరుద్దరణ కోసం రాహుల్ ఏమైనా జేసీ బ్రదర్స్ కు ఫోన్ చేశారా? అనే వాదనలూ లేకపోలేదు. రాజకీయాల్లో, గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వారి పట్టు ఎలాంటిదో తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ కాల్ చేశారనే వార్త వైరల్ అవుతోంది. అయితే.. రాహుల్ కాల్ చేశారో లేదో జేసీ బ్రదర్సే చెప్పాలి..!