రాజస్థాన్ రాజకీయాలు రోజుకో కొత్త కొత్త మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతున్నాయి. గెహ్లాట్ సర్కారును బీజేపీ కూల్చేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేలా మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో టేపుల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపింది. ఆడియో టేపుల వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ జైన్ ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నది.
చట్ట విరుద్ధంగా ఫోన్లను ట్యాప్ చేశారన్న బీజేపీ నేతల ఆరోపణలపై కేంద్ర హోంశాఖ స్పందించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని రాజస్థాన్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే సంభాషణలుగా చెబుతున్న ఆడియో టేపులపై కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే హోంశాఖ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తూ సిబిఐ దర్యాప్తు కోరుతుండగా ఆడియో టేపుల్లో ఉన్నట్లుగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించినట్లు అంగీకరింస్తోందని కాంగ్రెస్ వాదిస్తున్నది.
మరో పక్క అసమ్మతి నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిన సిఎం అశోక్ గెహ్లాట్.. శనివారం సాయంత్రం గవర్నర్కు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో అయన దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి, బలనిరూపించుకోడానికి అవకాశం ఇవ్వాలని గెహ్లాట్ కోరారు. బుధవారం నాడు అసెంబ్లీని సమావేశపరచాలని గెహ్లాట్ ప్రతిపాదించినట్టు సమాచారం. బలనిరూపణలో విజయం సాధిస్తామన్న ధీమాతో సీఎం ఉన్నారు. శాసనసభను సమావేశపరిస్తే పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేల బృందంపై కఠినమైన చర్యలకు మార్గం సుగమం అవుతుందని గెహ్లాట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా పైలట్కు చెక్ పెట్టేందుకు సీఎం పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు గెహ్లాట్ అందజేసినట్టు శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి ధారివాల్ ధ్రువీకరించారు. 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో మ్యాజిక్ సంఖ్య 101 కంటే ఎక్కువగా ఉందనీ, కాంగ్రెస్లో 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 19 మంది పైలట్ వర్గానికి చెందినవారని అయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇప్పుడు అవిశ్వాస తీర్మానం నెగ్గితే మరొ ఆరు నెలలు వరకు ప్రభుత్వానికి ఢోకా ఉండదు.
ప్రభుత్వాన్ని కూల్చడానికి సచిన్ పైలట్ ప్రయత్నించారనే ఆరోపణలతో పీసీసీ చీఫ్, డిప్యూటీ ముఖ్య మంత్రి పదవుల నుంచి ఆయనను తొలగించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుందర రాజే తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. రాజకీయాలపై చాలా రోజుల తరువాత ఆమె స్పందించారు. సిఎం గెహ్లాట్ కు అంతర్గత సహకారం అందిస్తున్నారని వస్తున్న వార్తలనుఆమె కొట్టి పారేశారు. తాను బీజేపీతోనే ఉంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలను పురస్కరించుకొని బీజేపీపై ఆరోపణలు చేయడం తగదన్నారు. కాగా బీటీపీ పార్టీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గెహ్లాట్ సర్కార్ కు మద్దత్తు తెలుపుతున్నారు.