తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం చిత్ర విచిత్రంగా ఉంది.ఆ నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తుండగా,ఆయన ఇంకా అధికారికంగా వైసిపికి జై కొట్టకపోయినా మంత్రిస్థాయి వైసిపి నాయకులు కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నారట.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం రాజోలు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రాపాక మాత్రం రాజోలులో నెగ్గారు.దీంతో అసెంబ్లీలో తమ ప్రతినిధి ఉన్నాడన్న జనసేన ఆనందం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయింది.రాపాక వరప్రసాద్ వైసిపి నేతలతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు.ఈమధ్య ఒక వీడియోలో ఆయన తనకసలు వైసీపీ టిక్కెట్ రావాల్సిందని కాకుంటే అనివార్య కారణాల వల్ల జగన్ ఇవ్వలేకపోవడంతో తాను జనసేనలో కొచ్చి గెలిచానని చెప్పుకున్నారు.అయితే అసెంబ్లీ లో అడుగు పెట్టిన రోజే ముఖ్యమంత్రి జగన్ తన భుజం తట్టి కలిసి పని చేసుకుందామన్నాడని ఆయన మాట ప్రకారమే తాను నడుచుకుంటానని రాపాక ఆ వీడియోలో చెప్పేశారు.అసెంబ్లీలో కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేస్తూ ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే మాదిరి చెలామణి అవుతున్నారు.
కాకుంటే ఇప్పటివరకు రాపాక వరప్రసాద్ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల మాదిరి వైసిపికి జగన్ సమక్షంలో జైకొట్టలేదు.ఇక రాజోలు నియోజకవర్గం విషయానికొస్తే అక్కడ వైసిపి నాయకులుగా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన అమ్మాజీ ,అంతకు ముందు ఎన్నికలలో పరాజితుడైన రాజేశ్వర్రావు ఉన్నారు.అమ్మాజీ ఇప్పటికీ నియోజకవర్గ వైసిపి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు.అయితే పార్టీ అధినేతలు రాజోలు వరకు రాపాక కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కన్పిస్తోంది.ఇటీవల రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన ఒక క్యాబినెట్ మంత్రి సొంత వైసిపి నేతలను పక్కనబెట్టి రాపాక తోటే కార్యక్రమాలన్నీ నిర్వహించటం అక్కడ రాజకీయ దుమారం రేపింది.మంత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిని అక్కడి సీనియర్ నాయకుడిని కాదని పార్టీలోకి ఇంకా రాని రాపాకను వెనకేసుకు తిరగడంపట్ల పార్టీ వర్గాలు రగిలిపోతున్నాయి.ఇలాంటి చర్యలు పార్టీ క్యాడర్ కు ఎలాంటి సంకేతాలిస్తాయని అర్థం చేసుకోవాలని వారు అంటున్నారు.ఈ విషయమై తూర్పుగోదావరి జిల్లా పార్టీఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డికి రాజోలు నేతలు ఫిర్యాదు చేశారని ఆయన పంచాయితీ నిర్వహిస్తున్నట్టు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?