విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన రాష్ట్రంలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. దీని చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. ఇందులో కులం కూడా ఉంది. కొంతమంది వ్యక్తులు ఈ ఊబిలోకి తమకు తాము వచ్చి చిక్కుకుంటున్నారు. వచ్చాక దీని లోతు తెలుసుకుని బయటకు వెళ్లలేక, అందులో ఉండలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇందులో సినీ హీరో రామ్ ప్రముఖుడు. తనకు సంబంధంలేని అంశంలోకి వచ్చి అనవసరంగా ఇరుక్కుని ఇప్పుడు అందరికీ పాయింట్ అయ్యాడు. ఇందుకు తాను చేసిన ట్వీట్లే కారణం. ముఖ్యంగా కులంపై రామ్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.
నిందితుల బెయిల్ పిటిషన్ వాయిదా
స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగుర్ని అరెస్ట్ చేసారు పోలీసులు. పలువురిని విచారించారు కూడా. ఈనేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్ వేయగా.. విచారించిన కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ను కూడా బెయిల్ పిటిషన్తో కలిపి విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. రమేశ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ ఈ నెల 21కి వాయిదా వేసింది మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు.
కులం కరోనా వైరస్ కంటే ప్రమాదం: హీరో రామ్
సినీ హీరోగా క్రేజ్ ఉన్న రామ్ ఎప్పుడు ఏ సమస్యపైనా, రాజకీయాలపైనా స్పందించింది లేదు. కానీ.. రమేశ్ హాస్పిటల్ విషయంలో ట్విట్టర్ లో తన గళం విప్పాడు. ఏకంగా ప్రభుత్వంతో పోరాటానికి దిగాడు. సీఎం వైఎస్ జగన్ కే జాగ్రత్తలు చెప్తూ చేసిన ట్వీట్స్ సంచలనం రేపాయి. నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుసు.. మీరూ తెలుసుకోండి.. మోసపోవద్దు అంటూ ట్వీట్స్ చేశాడు. ఎప్పుడూ లేనిది ఇటువంటి విషయాల్లోకి వచ్చిన రామ్ పై కుల ముద్ర పడింది. కారణం..
రమేష్ హాస్పిటల్ ఛైర్మన్ తన బంధువు కావడంతోనే వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడని రామ్ పై విమర్శలు వచ్చాయి. దీనిని నిజం చేస్తూ ఏకంగా కులం గురించి ట్వీట్ చేశాడు. ‘కరోనా కంటే కులపిచ్చి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరం. నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఇలాంటి వైరస్ కు దూరంగా ఉండండి. కులపిచ్చి వైరస్ నుంచి దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరే కాపాడుకోండి’ అంటూ ట్వీట్ చేశాడు.