ఈ మండలి వ్యవస్థ జగన్ కి అనేక తలనొప్పులు తీసుకొస్తుంది. పాపం మూడు రాజధానుల కథకి విరామం పడడానికి మండలి అడ్డుగా ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డని సాగనంపాలన్న మళ్ళీ మండలి అడ్డు వస్తుంది. పాపం… జగన్ కి సీఎం అయిన పది నెలలలోనే మండలి రూపంలో ఇన్ని అవాంతరాలు వస్తాయనుకోలేదేమో. అందుకే ఇప్పుడు అత్యవసరంగా మండలిని రద్దు చేయించాలి. అందుకు అవసరమైతే అమిత్ షా వయా అంబానీ వయా నత్వాని వెళ్లాల్సిందే. అదన్నమాట సంగతి. నిమ్మగడ్డ రమేష్ ని పంపించాలంటే మండలి అడ్డు ఏమిటో కాస్త తెలుసుకుందాం పదండి.
రమాకాంత్ రెడ్డి ఇచ్చిన సూచన ఇదే…!
రమాకాంత్ రెడ్డి అందరికి గుర్తుండే ఉంటారు. ఒకప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్ కూడా. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి ప్రశాంతంగా ఉంటున్నారు. ఈయన వైఎస్ కుటుంబానికి సన్నిహితులు. ఈ చనువుతో జగన్ ఇటీవల రమాకాంత్ రెడ్డితో కీలక భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలను స్వీప్ చేస్తున్నాం అనుకున్న సమయంలో రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసేసారు. కేంద్రానికి పిర్యాదులు చేసారు. ఇక ఈయన ఉండగా మనం అనుకున్నది చేయలేము..! దీనికి పరిష్కారం ఏంటి?? అంటూ ఆరాలు తీశారు. వెంటనే రమాకాంత్ కి నాడు శేషన్ విషయంలో పివి నరసింహారావు చేసిన పన్నాగం గుర్తొచ్చింది. అదేమిటనగా “ఎన్నికల కమిషనర్ ని ఒకరి నుండి ముగ్గురు సభ్యులుగా పెంచడం. అంటే ఇప్పుడున్న కమిషనర్ వ్యతిరేకంగా ఉన్నా కొత్తగా వచ్చే ఇద్దరూ మనకు అనుకూలులు వస్తే మెజారిటీతో అనుకున్ననిర్ణయాలు అమలు చేయవచ్చు” అన్నమాట. నాడు పివి ప్రధానిగా ఉండగా సేషన్ ఇదే తీరున చేశారని ముగ్గురు సభ్యులను పెట్టి, సేషన్ని డమ్మీని చేశారని” రమాకాంత్ రెడ్డి జగన్ కి గుర్తు చేసారు. అంటే ఇప్పుడు రమేష్ కి తోడుగా మరో ఇద్దరు కమిషనర్లని నియమించి వారి ద్వారా తమ నిర్ణయాలు అమలయ్యేలా చూడడం. తొలగించడం కష్టం కానీ, లాబీయింగుల ద్వారా నియమించడం సులువే.
కానీ… మండలి అడ్డమే…!
ఇది జరగాలంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ముగ్గురు కమిషనర్లు అవసరమంటూ శాసనసభలో తీర్మానం చేయాలి. దాన్ని మండలిలో ఆమోదించాలి. అది గవర్నర్ కి చేరి తద్వారా కేంద్రానికి వెళ్తుంది. కేంద్రం ఆమోదం తర్వాత రాష్ట్రపతి అనుమతిస్తే ముగ్గురు కమిషనర్లు వచ్చేస్తారు. వచ్చే వారిని తమ వారిని తెచ్చుకోవడం జగన్ కి సులువే. కానీ ఇప్పటికిప్పుడు ఆ తీర్మానం చేయడమే కష్టం. అసెంబ్లీలో ఆమోదించినా, మండలిలో కచ్చితంగా అడ్డు పడుతుంది. పోనీ త్వరగా మండలిని రద్దు చేసే బిల్లుని పార్లమెంటు ఆమోదించి, త్వరగా రద్దు చేయాలన్నా కనీసం ఆరు నెలలు పడుతుంది. అసలు బిజెపిలో ఆ కదలికలు లేవు. ఇదీ కథ. పాపం జగన్ కి రెండు నెలల వ్యవధిలోనే మండలి గండం మళ్ళీ వచ్చి పడింది.