వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మనసు గెలుచుకునే ప్రయత్నాల్లో రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు.నియోజకవర్గంలో వైసిపి నేతలు తన ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నేరుగా ఆయన పార్టీ అధినేత ద్వారానే ఎంట్రీకి పావులు కదుపుతున్నారు. కరోనా సహాయ నిధికి రాజోలు నియోజకవర్గం నుండి వసూలు చేసిన ముప్పై లక్షల రూపాయల విరాళాన్ని రాపాక ముఖ్యమంత్రికి అందజేయడం ఈ ఎత్తుగడలో భాగమే అంటున్నారు.మొన్నటి ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం రాజోలు.
జనసేనాని పవన్ కల్యాణ్ సైతం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రాజోలులో రాపాక ఎలా గెలిచాడు అన్నది ఇప్పటికీ మిస్టరీ!ఏ కారణం ఎలా ఉన్నప్పటికీ రాపాక ఎమ్మెల్యే అయిపోయారు.జనసేన కూడా అసెంబ్లీలో తనకూ ప్రాతినిధ్యం లభించిందని కొన్నాళ్లు ఆనంద పడింది .అయితే అది మూన్నాళ్ల ముచ్చటే అయింది .తాను జగన్ శిష్యుడినేనని ,తనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో వైసిపి ఉండగా తాను అనివార్యమై జనసేన కి వచ్చానని, ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా నిరూపించుకున్నాక ముఖ్యమంత్రి జగన్ కలిసి పనిచేద్దామని ప్రతిపాదించినందున తాను వైసిపి వైపు మళ్లానని రాపాక ఒక వీడియోలో స్వయంగా చెప్పారు.ఇంకా చెప్పాలంటే ఆయన జనసేనకు విడాకులిచ్చేశారు అసెంబ్లీలో కూడా జగన్ జపం చేస్తున్నారు.అయితే వరప్రసాద్ వైసీపీలోకి రావడం ఇప్పటికే రాజోలులో పాతుకుపోయిన ఇద్దరు సీనియర్ పార్టీ నేతలకు రుచించక అడ్డంకులు సృష్టిస్తున్నారు.2014 లో ఓడిపోయిన రాజేశ్వర్రావు, మొన్నటి ఎన్నికల్లో రాపాకే ఓడించిన వైసిపి అభ్యర్థి అమ్మాజీ నియోజకవర్గంలో వరప్రసాద్ ని అడ్డుకుంటున్నారు.
ఇటీవల ఒక కేబినెట్ మంత్రి రాజోలులో పర్యటించిన సందర్భంలో తమను రాకుండా వరప్రసాద్ ని వెంటేసుకు తిరగడాన్ని వారు తూర్పుగోదావరి జిల్లా పార్టీఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు.మొత్తం మీద రాజోలులో కొద్దిగా తనకు వైసీపీ స్థానిక నేతల పరంగా ఇబ్బంది ఉందని గమనించిన రాపాక నేరుగా పార్టీ అధినేత తలుపు తట్టారట.కరోనా ఉదృతి దాదాపు తగ్గిపోయాక ఇప్పుడు ఆయన ముప్పై లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించటం జగన్ ను మెప్పించడం కోసమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.సీఎం వైపు నుంచే నరుక్కొచ్చే రాజకీయం మొదలెట్టిన రాపాక భవితవ్యం ఎలా వుంటుందో చూడాలి