Ratna Prabha: రత్నప్రభ Ratna Prabha తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్రంలో రాజకీయ వేడి రగిస్తోంది. మండే ఎండలను కూడా లెక్క చేయక పార్టీలు, నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బీజేపీ-జనసేన కూటమి.. ఆ రెండు పార్టీల నాయకుల మధ్య మైత్రి, పవన్ పై బీజేపీ నాయకుల వ్యాఖ్యలు. 1999 తర్వాత తిరుపతిలో గెలవని బీజేపీ ఈసారి పవన్ పై నమ్మకంతో బరిలో దిగుతోంది. పవనే మా సీఎం అభ్యర్ధి అంటూ ప్రచారంలోకి వెళ్లింది. ఈ ఎన్నికలకు పవన్ సీఎం అనే ప్రచారానికి సంబంధం లేకపోయినా ఈ మాట రాజకీయంగా హీటెక్కించింది. అయితే.. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు నిరాధారమా? అనే అనుమానాలు వస్తున్నాయి.
తిరుపతిలో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ ఓ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ.. ‘పవన్ మా సీఎం అభ్యర్ధి కాదు. ఆ విషయం నాకు తెలీదు’ అనేశారు. దీంతో బీజేపీ అసలు జనసేనతో మైత్రితో ఉందా.. లేదా పవన్ క్రేజ్ ను వాడుకుంటోందా? అనే కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి మొన్నటి ఎన్నికల్లో అంటూ ప్రత్యర్ధులు అంటున్నారు. ఈ పరిస్థితిలో పవన్ ను ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ సమయంలో సోము వీర్రాజు.. పవనే మా సీఎం అని చేసిన ప్రకటనను నాదెండ్ల మనోహర్ సైతం స్వాగతించారు. జనసైనికుల్లో కూడా జోష్ వచ్చింది. ఈ సమయంలో రత్నప్రభ ఇలా అనటం చర్చనీయాంశమైంది.
పవనే మా సీఎం అభ్యర్ధి అంటున్న సోము, సునీల్ ధియోధర్ చేసిన వ్యాఖ్యలు నమ్మాలా.. సాక్షాత్తూ అభ్యర్ధే ఈ వ్యాఖ్యలు అబద్ధం అనేది నమ్మాలా? అనేది ఇప్పుడు జనసైనికుల్లో వస్తున్న సందేహం. నిజంగానే మైత్రి, పొత్తుతో ఉన్నారా? లేక పవన్ మేనియాను వాడుకుంటున్నారా? అనేది రాజకీయంగానూ.. పవన్ శ్రేణుల్లోనూ వస్తున్న సందేహం. ఏదేమైనా.. దుబ్బాక తరహాలో తిరుపతిలో సత్తా చూపించాలని భావిస్తున్న బీజేపీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగనిది. తెలంగాణ బీజేపీతో తెగతెంపులు చేసుకున్న పనవ్ ఏపీలో మాత్రం పొత్తులో ఉన్నారు. ఈనేపథ్యంలో నేడు పవన్ తిరుపతిలో ప్రచారానికి వస్తున్నారు. మరి.. రత్నప్రభ వ్యాఖ్యల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మరి.