Ratna Prabha IAS : తిరుపతి ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు టీడీపీ, వైసీపీ కంటే బీజేపీ అభ్యర్థి విషయంలోనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. టీడీపీ తరపున పనబాక లక్షమి అందరికీ తెలిసిన మొహమే. గత ఎన్నికల్లో పోటీ చేశారు. వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి. కేవలం పార్టీ జెండా, జగన్ మాత్రమే ఆయనకు బలం. స్వతహాగా ఆయనకు బలం లేదు..! కానీ బీజేపీ అభ్యర్థి విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. జనసేనాని ఒప్పించి, పోటీకి మద్దతు తీసుకుని.., ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారిని పట్టుకొచ్చారు. ఇంతకూ ఈ రత్నప్రభ ఎవరు..? ఆమె ఎందుకు పోటీకి దిగారు..? ఓడిపోతే బీజేపీ ఇవ్వనున్న గౌరవం ఎలా ఉండనుంది..!? అనేది పరిశీలించాల్సిన అంశాలే..!!
Ratna Prabha IAS : ఉన్నత విద్యా కుటుంబం..!!
రత్నప్రభ సొంత ఊరు ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర్లో. ఆమె చదువు, పెరగడం మొత్తం హైదరాబాద్ లోనే. తండ్రి చంద్రయ్య కూడా ఐఏఎస్ అధికారి. ఆమె భర్త విద్య సాగర్, సోదరుడు సాయి చంద్ర కూడా ఐఏఎస్ అధికారులే. ఏపీలో వివిధ హోదాల్లో పని చేశారు. 1981 బ్యాచ్ కి చెందిన రత్నప్రభ కూడా ఏపీలో పని చేసి, కర్ణాటకకు వెళ్లారు. అక్కడ 2017 లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకుని… 2018 లో పదవీ విరమణ చేశారు. అనంతరం బీజేపీలో చేరి, కర్ణాటక రాజకీయాల్లో మహిళా విభాగం తరపున బీజేపీకి కీలకంగా పని చేస్తున్నారు. మహిళా అభ్యుదయం, మహిళా సాధికారిత అంశాలపై ఎక్కువగా చర్చలు జరుపుతుంటారు. తెలుగు వ్యక్తి కావడం, బీజేపీకి అత్యంత నమ్మకమైన మహిళా నేతగా ఉండడంతో తిరుపతి సీటుకి అధిష్టానం ఆమెని ఎంపిక చేసింది.
జగన్ కేసుల్లో కూడా ..! కానీ..!!
ఈమె ఏపీలో అనేక హోదాల్లో పని చేసారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు, దివంగత రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కార్యదర్శి హోదాలో పలు శాఖల్లో విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే 2011 , 2012 సమయంలో జగన్ పై సీబీఐ కేసుల నమోదులో ఈమె పేరు కూడా ఓ చార్జిషీటులో చేర్చారు. 2014 లో ఈమె డిశ్చార్జి పిటిషన్ వేసి, క్లీన్ చీట్ తెచ్చుకున్నారు. అనంతరం కేంద్ర సర్వీసులకు, కర్ణాటకకు వెళ్లిపోయారు. రిటైర్ అయిన తర్వాత బీజేపీలో చేరి, పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.
గెలుపు కోసం ప్రణాళికలు.. లేకపోతే..!!
బీజేపీ ఏపీలో ఎక్కడైనా గెలవడం అంత సులువు కాదు. 2019 ఎన్నికల్లోనే ఆ పార్టీకి దిక్కు లేదు. ఇప్పుడు ఆ పార్టీ మరింత దిగజారింది. పోలవరం నిధులు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో బీజేపీ విలన్ గా మారిపోయింది. అందుకే తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి పరువు దక్కడం కూడా కష్టమే. కాకపోతే జనసేన, ఓ సామాజికవర్గం ఓట్లు కోసం నమ్మకం పెట్టుకుని.. ఉనికి కోసం పోరాడుతుంది. కొన్ని ప్రత్యేక ప్రణాళికలతో, హిందూ సెంటిమెంట్ తో బరిలోకి దిగుతుంది. ఒకవేళ ఓడినా రత్నప్రభకి కూడా పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ పెద్దలు భరోసా ఇచ్చారట. ఆమెకి ఉన్న అపారమైన పాలన అనుభవం, ఉన్నతమైన విద్యా విలువలతో ఆమెకు ఏపీలో రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వడానికి లేదా.. ఆమె కోరితే మరో రాష్ట్రానికి ఇంచార్జి ఇవ్వడానికి కూడా బీజేపీ పెద్దలు వెనుకాడరని అంటున్నారు. సో.. భవిష్యత్తు ఆశల దృష్ట్యా.. ఆమె ఈ ఎన్నికల్లో పోటీలోకి దిగారని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది..!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?