పీవీ నరసింహారావు దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి. దేశం గర్వించదగ్గ నాయుకుడిగా ఎదిగారు. భారత ముఖచిత్రంపై ప్రధానిగా చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు. ఆయనకు భారతరత్న ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. సీఎం కేసీఆర్ ఈమేరకు అసెంబ్లీలో తిర్మానం కూడా చేశారు. అయితే.. పీవీకి భారతరత్న ఇవ్వాలంటున్న కేసీఆర్ కు ఇప్పుడే ఈ విషయం గుర్తొంచిందనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కు ఓ ఆలోచన వచ్చినా.. దాని మీద పట్టుబట్టి కూర్చున్నా దాని వెనుక ఆయనకు స్వలాభమో, లేక దీర్ఘకాలిక ప్రయోజనమో ఉంటుందని భావించాల్సిందే. ఇదే ఆయన అర్జంట్ గా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన చేస్తూండడంతో జాతీయస్థాయిలో గుర్తింపు కోసమే ఈ అంశాన్ని వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు.
పీవీ భారతరత్న డిమాండ్ అందుకే..
ఈరోజు భారత్ అనుభవిస్తున్న ఫలాలకు ఆనాడు పీవీ తీసుకున్న నిర్ణయాలే. సంకీర్ణ ప్రభుత్వాన్ని అయిదేళ్లు విజయవంతంగా నడిపించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న కేసీరా డిమాండ్ తో.. తెలంగాణ రాష్ట్ర సాధనలో దేశంలో మోగిపోయిన కేసీఆర్ పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తుంది. పైగా.. కాంగ్రెస్ పీవీ మృతి చెందిన సమయంలో తగిన గుర్తింపు ఇవ్వలేదని ఓ వాదన ఉంది. ఈ సమయంలో పీవీని కాంగ్రెస్ విస్మరించింది.. తాము ఆయనకు గౌరవం ఇస్తున్నామనే భావన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. తద్వారా గత ఎంపీ ఎన్నికల్లో తగ్గిన తెలంగాణ ప్రజాదరణ మళ్లీ తాను పొందే అవకాశం.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం కూడా ఉంది.
కొత్తపార్టీ సన్నాహాలు జరుగుతున్నాయా..
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమనీ.. ‘నయా భారత్’ పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు యోచిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. దీనిని కేసీఆర్ ఈ సోమవారం జరిగిన పార్టీ టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కొట్టి పారేశారు. ప్రస్తుతానికి ఇటువంటి ఉద్దేశాలు లేవని తేల్చేశారు. ఇప్పుడే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని.. కొత్త పార్టీపై జరుగుతున్న ప్రచారాలు నమ్మొద్దని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన సమయం వస్తే అప్పుడు అందరితో చర్చిస్తామని ప్రస్తుతానికి ఈ వదంతులు నమ్మొద్దని పార్టీ నేతలతో అన్నారు.