మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడు గురించి పరిచయం చేయనవసరం లేదు.
తనదైన శైలిలో ముందుకు సాగే ఈ డైనమిక్ నేత తాజాగా మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమీక్ష సమావేశంలో రేవంత్ పాల్గొని తనదైన శైలిలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, రాబోయే ఎన్నికల గురించి స్పందించారు.
టీఆర్ఎస్ – ఎంఐఎం లెక్క ఏంటంటే….
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల సమావేశంలో భాగంగా గ్రేటర్ ఎన్నికల వ్యూహంపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్, ఓటర్లను చేర్పించడంలో కాంగ్రెస్ పార్టీ, నేతలు సరైన దిశగా పోరాటం చేయాలన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం డీలిమిటేషన్, బోగస్ ఓట్లతో గెలవాలని చూస్తుందని ఎంపీ రేవంత్ రెడ్డి విశ్లేషించారు. ఎన్నికల కమిషనర్ కూడా నియమించని ప్రభుత్వం హడావుడిగా నియామకం చేసిందని ఆరోపించారు.
రేవంత్ కొత్త లెక్క
డి లిమిటేషన్ అంటే మొత్తం జనాభా డివైడెడ్ బై సీట్లు ఉండాలని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. అయితే, దీనికి భిన్నంగా హైదరాబాద్లో అడ్డగోలుగా ఈ ప్రక్రియ చేశారని ఆరోపించారు. “ఓల్డ్ సిటీలో 15 నుంచి 30 వేల ఓట్లు ఒక చోట ఉంటే ఇంకో దగ్గర 70,000- 80 వేలు ఉన్నాయి. ఇలా ఎన్నో అవకతవకలు ఉన్నాయి. అందుకే డిలిమిటేషన్ చేసేప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. “ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మేయర్ పదవి బీసీ మహిళలకు కేటాయించారని పేర్కొన్న రేవంత్ రెడ్డి మళ్ళీ డివిజన్లు మారుస్తారా అన్నది పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో లీగల్ గా ఎప్పటికప్పుడు అప్రోచ్ కావడానికి లీగల్ టీమ్ సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
కొత్త ఫార్ములాతోనే…
150 డివిజన్లలో ముఖ్య నాయకులను ప్రధానంగా యువకులను గుర్తించి గడప గడపకు పాదయాత్ర చేసి వాళ్ళ ను నామినేట్ చేస్తే బాగుంటుందని ఎన్నికల్లో బరిలో దిగే వారి విషయంలో రేవంత్ రెడ్డి కొత్త ఫార్ములా ప్రతిపాదించారు. “ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ వర్గాల వారు ఉన్నారు, ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ ప్రాంతాల వారు ఉన్నారో గుర్తించి నాయకులను నియమిస్తే ప్రయోజనం ఉంటుంది. బూత్ స్థాయిలో పకడ్బందీగా ఓట్లను పొందే విధంగా ప్రతి గడపకు మనం వెళ్లే విదంగా పనిచేయాలి. పూర్తి స్థాయిలో పని విభజన జరగాలి..క్షేత్ర స్థాయి లో పని జరగాలి. “ అని రేవంత్ రెడ్డి సూచిచంరాఉ.
ఇలా అయితేనే…
ప్రతి డివిజన్లలో డివిజన్ మేనిఫెస్టో ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. “ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని హామీలు బాగా ప్రచారం చేయాలి. బోగస్ ఓట్ల గుర్తింపు విషయంలో పార్టీ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నా పార్లమెంట్ పరిధిలో పార్టీకి సంబంధించి ఏ నియమాకాలు జరిగిన డీసీసీ, ఇంచార్జి ప్రధాన కార్యదర్శి అప్రోవల్ ద్వారా చేయాలని మనవి చేస్తున్నాను“ అంటూ రేవంత్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, నగర అధ్యడులు అంజన్ కుమార్ యాదవ్ సహా వివిధ పార్టీల నేతలు ఈ సందర్భంగా హాజరయ్యారు.